జెడి బదలీ: బొత్స, కిరణ్లపై మండిపడ్డ జగన్ పార్టీ నేత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వెంటనే బొత్సను బర్తరఫ్ చేసి నిష్పక్షపాత విచారణకు అనుమతించాలని డిమాండ్ చేశారు. ఇంత జరుగుతున్న బొత్స బర్తరఫ్కు తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయడం లేదని విమర్సించారు. టిడిపి, కాంగ్రెసు నేతలు ఈ కేసులో ఒకరిని మరొకరు కాపాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. మద్యం కుంభకోణంలో ఇద్దరికీ సంబంధముందన్నారు. అందుకే అధికారిని బదలీ చేయిస్తున్నారన్నారు.
మద్యం కుంభకోణంతో సంబంధం ఉన్న ఎమ్మెల్యేలు, టిడిపి, కాంగ్రెసు నేతలను వెలికి తీయాలన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్ని స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శించారు. మద్యం మాఫియా కుంభకోణాన్ని మాయ చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిఎం, పిసిసిల మధ్య విభేదాల వల్ల అధికారులు బలవుతున్నారన్నారు. టిడిపి నేతలు కాంగ్రెసుతో గల్లీలో కొట్లాడుతూ ఢిల్లీలో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెసు, టిడిపిలకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని మరో నేత శోభా నాగి రెడ్డి తిరుపతిలో అన్నారు. ఎన్నికలు జరిగితే ఓడిపోతామన్న భయంతో ఉప ఎన్నికల వాయిదాకు కుట్ర పన్నుతున్నారన్నారు. ఎన్నికలు నిర్వహించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరతామన్నారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.