అధిష్టానమే చూసుకుంటుంది: విహెచ్పై పురంధేశ్వరి

విజయవాడ పూర్ణానందం పేటలో నూతనంగా నిర్మించిన ఒక హోటల్ ప్రారంభోత్సవానికి ఆమె, ఆమె భర్త వెంకటేశ్వరరావు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా హోటల్లోనే ఆమె మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. తాను ఇక్కడ రాజకీయాలు మాట్లాడనని చెప్పారు. అయితే ఇటీవల నీతి, నిజాయితీలకు సంబంధించి బాగా చర్చ జరుగుతోందని, నైతిక విలువలు పాటించే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయన్న విషయమై ఆమె బదులిస్తూ, బాధ్యతగల పదవులలో ఉన్న వ్యక్తులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలని, తప్పుచేస్తే నిజాయితీగా ఒప్పుకుని పదవి నుంచి వైదొలగడం మంచిదేనని చెప్పారు.
ఇలాంటి విషయంలో మీరిచ్చే సలహా ఏమిటనే ప్రశ్నకు ఆమె భర్త, పర్చూరు ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్పందిస్తూ, నైతిక విలువలు పాటించాలనేది ఒకరు చెబితే నేర్చుకునేది కాదని, ఎవరికి వారే పాటించాలని, ఎవరి పరిధిలో వారే అవినీతికి పాల్పడకుండా ఉండడం మంచిదని సూచించారు. దీనిపై పురంధేశ్వరి స్పందిస్తూ, తమ విషయానికి వస్తే ఎటువంటి అనవసర వ్యాఖ్యలు చేయమని, చేతలలోనే చూపిస్తామన్నారు.
రాహుల్గాంధీని మంత్రి వర్గంలోకి తీసుకోవడంలో తప్పులేదన్నారు. ఆయనకు అందరి సహకారం ఉంటుందని, ఆయన కూడా అందరి సహకారంతో ముందుకు వెళతారని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంలో ఎవరి పరిధిలో వారు కృషి చేయడంలో తప్పులేదన్నారు. రాహుల్గాంధీ ప్రచారం వల్లే యుపీలో ఐదు శాతం ఓట్లు పెరిగిన విషయాన్ని గుర్తించాలని చెప్పారు.












Click it and Unblock the Notifications