డెడ్లైన్తో తెలంగాణ ఉద్యమం చేపట్టాలి: కోదండరామ్
తెలంగాణను ఇవ్వలేమంటూ రాష్ట్రపతికి కేంద్ర హోం శాఖ నివేదిక ఇచ్చిందన్న సమాచారం విశ్వసనీయతను పరిశీలించకుండానే మీడియాలో కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలంటూ... కేంద్రమంత్రి చిదరంబరం మూడేళ్ల నుంచి అరిగిపోయిన రికార్డునే వినిపిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ విషయంలో ఇంటి దొంగలను వదిలేసి తనను రాజీనామా చేయాలని కొందరు కోరుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విషయంలో మోసం చేస్తే మొదటి రాజీనామా తనదేనని ఎంపీ మధుయాష్కీ ప్రకటించారు.
రాష్ట్రపతి ప్రణబ్ తెలంగాణ ఏర్పాటుకు ఎలా సహకరిస్తారో చెప్పాలని ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి కోరారు. సమైక్యాంధ్రకు కిరణ్కుమారే ఆఖరి సీఎం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు అన్నారు. సకల జనుల సమ్మెను నాయకులు అందుకోలేకపోయారని టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామిగౌడ్ ఆరోపించారు. తెలంగాణ కోసం మరో పోరాటానికి ఉద్యోగులు సిద్ధమని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్ అన్నారు.
మరోవైపు తెలంగాణ ఉద్యమవేడిని మళ్లీ రగిలించడానికి విద్యార్థి ఐకాస సిద్ధమవుతోంది. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా కేంద్రంపై ఒత్తిడి పెంచడంలో రాజకీయ పార్టీలు విఫలమైనందున ఇకపై ఉద్యమ నిర్మాణంపైనే దృష్టి సారించాలని విద్యార్థి జేఏసీ భావిస్తోంది. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో శనివారం అత్యవసర సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించింది.
దీని ప్రకారం ఆగస్టు తొలివారం నుంచి గ్రామ స్థాయిలో ఉద్యమ నిర్మాణాన్ని చేపట్టి, సెప్టెంబరు 27న లక్షలాది విద్యార్థులతో చలో సెక్రటేరియట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు విద్యార్థి నేతలు తెలిపారు. టీఎస్ విద్యార్థి ఐకాస చైర్మన్ పిడమర్తి రవి, అధ్యక్షుడు రాజారామ్ యాదవ్ తమ భవిష్యత్తు ప్రణాళికను వివరించారు. ఆగస్టు ఒకటి నుంచి ఏడు వరకు అన్ని జిల్లాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం, 8 నుంచి 15 వరకు 'గో టు కాలేజ్' కార్యక్రమం ద్వారా కళాశాల విద్యార్థులతో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేయడం, 16 నుంచి 30 వరకు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో విద్యార్థి భేటీలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు.
సెప్టెంబరు ఒకటి నుంచి 17 వరకు తెలంగాణ జిల్లాల్లో గ్రామగ్రామాన పాదయాత్రలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. సెప్టెంబరు 27న 'తెలంగాణ విద్యార్థుల హైదరాబాద్ కవాతు' నిర్వహించి లక్షలాది మందితో సెక్రటేరియట్ను ముట్టడిస్తామని, సీమాంధ్రఉద్యోగులను తరిమి కొడతామని జేఏసీ హెచ్చరించింది.