మళ్లీ ఉప రాష్ట్రపతి అన్సారీయే: జస్వంత్పై గెలుపు
తొలి ఓటును తెలుగువారైన నర్సాపురం కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కనుమూరి బాపిరాజు వేశారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఈ ఎన్నికల్లో యూపీఏ తరపున ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్న హమీద్ అన్సారీ పోటీచేయగా, ఎన్డీఏ తరపున జశ్వంత్ సింగ్ పోటీ పడ్డారు. ఈ ఎన్నికలకు తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలు దూరంగా ఉన్నాయి.
యుపిఎ భాగస్వామ్య పక్షాలతోపాటు దానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలూ అన్సారీకే ఓటు వేశాయి. దేశ 14వ ఉప రాష్ట్రపతిగా అన్సారీ ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలోనే, యూపీఏ భాగస్వామ్య పక్షాలు, బయటినుంచి మద్దతు ఇస్తున్న పార్టీల ఎంపీలకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సోమవారం మధ్యాహ్నం ఢిల్లీలోని హోటల్ అశోకాలో విందు ఇచ్చారు. దీనికి రాజకీయ బద్ధ విరోధులైన ఎస్పీ అధినేత ములాయంసింగ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి హాజరయ్యారు.
మరో భాగస్వామ్య పక్షమైన తృణమూల్ మంత్రులు సుదీప్ బందోపాధ్యాయ, సీఎం జతువాలతోపాటు పార్టీ ఎంపీలంతా సోనియా ఇచ్చిన విందు భేటీకి హాజరయ్యారు. అయితే, ఢిల్లీలో లేకపోవడంతో ఎన్సీపీ నేతలు శరద్ పవార్, ప్రఫుల్ పటేల్లు ఈ విందుకు హాజరు కాలేదు. కాగా.. తమ పార్టీ మద్దతు ఎన్డీయే అభ్యర్థి జస్వంత్కేనని అన్నాడియంకె అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత ప్రకటించారు. ఎన్నికలకు దూరంగా ఉండాలని బిజు జనతాదళ్ నిర్ణయించింది.