రాజీనామా సమర్పణ: బుజ్జగించినా వినని ధర్మాన
రాజీనామా చేయవద్దని గంటా శ్రీనివాస రావు ధర్మాన ప్రసాద రావుకు నచ్చ జెప్పే ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇద్దరు శాసనసభ్యులు కూడా వచ్చారు. కార్యకర్తలు విమానాశ్రయానికి పెద్ద యెత్తున వచ్చారు. గంటా శ్రీనివాస రావుతో మాట్లాడిన తర్వాత ధర్మాన ప్రసాద రావు నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రికి తన రాజినామా లేఖను సమర్పించారు.
మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ధర్మాన ప్రసాద రావు హైదరాబాదుకు చేరుకున్నారు. తన కోసం విమానాశ్రయం వద్ద నిరీక్షిస్తున్న బుగ్గ కారును ఆయన వెనక్కి పంపించేశారు. గంటా శ్రీనివాస రావు కారులోనే ఆయన ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు. రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఆయన గంటా శ్రీనివాస రావుతో కలిసి ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చెప్పినప్పుడు సిబిఐ అభియోగాలు మోపిన తర్వాత పదవిలో కొనసాగడం నైతికం కాదని ధర్మాన ప్రసాద రావు అన్నారు. రాజీనామానైనా అమోదించండి లేదా తనను సిబిఐ అరెస్టు చేయకుండానైనా చూడండి అని ధర్మాన ప్రసాద రావు ముఖ్యమంత్రితో అన్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి 11 గంటల దాటే వరకు ముఖ్యమంత్రితో ధర్మాన భేటీ జరిగింది.
మీడియాతో మాట్లాడడానికి ధర్మాన గంటాతో కలిసి వచ్చారు. గంటా శ్రీనివాస రావు ఉన్నప్పటికీ చాలా సేపు ధర్మానకు, ముఖ్యమంత్రి ముఖాముఖి భేటీ జరిగింది. ముఖ్యమంత్రికి రాజీనామా లేఖ ఇచ్చేసి గంటా శ్రీనివాస రావు వాహనంలో ధర్మాన వెళ్లిపోయారు. తన రాజీనామాపై తుది నిర్ణయాన్ని ధర్మాన ముఖ్యమంత్రికే వదిలేసినట్లు తెలుస్తోంది.
అయితే, ధర్మాన ప్రసాదరావు రాజీనామాను ఆమోదించకూడదని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. ధర్మాన రాజీనామా చేస్తే ఇంతటితో ఆగదని అంటున్నారు. సుప్రీంకోర్టు నోటీసులు అందుకున్న మిగతా నలుగురు మంత్రులపై కూడా దాని ప్రభావం పడే అవకాశం ఉంది. బుధవారంనాడు శ్రీకాకుళం జిల్లాలో జాతీయ పతాకావిష్కరణకు దూరంగా ఉండాలని ధర్మాన ప్రసాదరావు నిర్ణయించుకున్నారు. దీంతో జిల్లాకు చెందిన మరో మంత్రి కొండ్రు మురళి పతాకావిష్కరణ చేస్తారు.