ముఖ్యమంత్రి బస్సుపై రాళ్ల వర్షం: లాఠీఛార్జ్, ఉద్రిక్తం
ముఖ్యమంత్రికి, కాంగ్రెసుకు వ్యతిరేకంగా.. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ పైన రాళ్ల వర్షం కురిపించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఆందోళనకారుల దాడిలో ముఖ్యమంత్రి కాన్వాయ్ అద్దాలు పగిలాయి. పోలీసులు పలువురు తెలంగాణవాదులను అదుపులోకి తీసుకున్నారు.
పలుచోట్ల ఆందోళనకారులు ముఖ్యమంత్రి కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. కాకతీయ ఉత్సవాలకు నిధుల మంజూరు సరిగా లేదని తెలంగాణవాదులు ఆందోళన చెందారు. అరకొర నిధులతో ఉత్సవాలను ఎలా జరుపుతారని ప్రశ్నించారు. కాకతీయ ఉత్సవాలకు కేటాయించిన నిధులు చూస్తేనే తెలంగాణకు సమైక్యాంధ్రలో ఎంత అన్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చునని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కెయు విద్యార్థులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
నిర్ణయం వస్తుంది
కాంగ్రెసు పార్టీ ఆల్ పార్టీ మీటింగుకు వెళ్తుందని మంత్రి జానా రెడ్డి అన్నారు. సోనియా, పార్టీ సీనియర్లతో చర్చించి తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. అఖిల పక్ష భేటీ తర్వాత నిర్ణయం సానుకూలంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. పార్టీలన్నీ తమ వైఖరిని ప్రకటించాలని సచించారు. 2013లోగా తెలంగాణ సాకారమవుతుందన్నారు.
బాబు నమ్మకం కోల్పోయారు
టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారని నాగం జనార్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు అనుకూలంగా టిడిపి నిర్ణయం తీసుకుంటే నమ్మకం పెరుగుతుందన్నారు. తెలంగాణ కోసం ఎన్డీయేకు మద్దతు కొనసాగుతుందన్నారు. పార్టీలన్నీ ఢిల్లీకి వెళ్లి స్పష్టమైన వైఖరిని తెలియజేయాలన్నారు. సీమాంధ్ర నేతల ఒత్తిడికి బాబు తలొగ్గవద్దన్నారు.