అక్బర్ అరెస్టుపై ఉత్కంఠ: గాంధీ ఆస్పత్రి వద్ద ఆందోళన
వైద్య పరీక్షలు పూర్తయినందు వల్ల తాను ఇంటికి వెళ్లిపోతానని అక్బరుద్దీన్ చెప్పారు. దానికి పోలీసులు నిరాకరించారు. వైద్య పరీక్షల నివేదికలు వచ్చే వరకు ఉండాలని వారు సూచించారు. దీంతో పోలీసులతో అక్బరుద్దీన్ వాదనకు దిగారు. ఆయనను పోలీసులు ఆస్పత్రిలోని రెండో విశ్రాంతి గదికి తరలించారు. సీటీ స్కాన్ తప్ప మిగతా పరీక్షలన్నింటిలో అక్బరుద్దీన్ ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్లు తేలింది.
ఇదిలా వుంటే, హైదరాబాద్లో అక్బరుద్దీన్ ఒవైసీకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆస్పత్రి ప్రధాన ద్వారం దగ్గర ఎంఐఎం కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు మెయిన్ గేట్ను మూసివేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆస్పత్రి పరిసరాల చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఆస్పత్రి పరిసరాల్లో మజ్లీస్ కార్యకర్తలు వాహనాలపై దాడి చేశారు. ఈ దాడిలో రెండు వాహనాలు ధ్వంసమైనట్లు సమాచారం. మజ్లీస్ కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అటు పాతబస్తీలో కూడా పోలీసులు భారీగా మోహరించారు. గుంపులు గుంపులుగా తిరుగొద్దంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక పోలీసు బలగాలు కూడా రంగంలోకి దిగాయి.