లోకేష్కు ఒకటే చెప్పా, జగన్ది తాత్కాలికమే: బాబు
ప్రజల కోసం తాను ఇబ్బందులు ఎదుర్కొని పాదయాత్ర చేస్తున్నానని ఆయన చెప్పారు. తాను పాదయాత్ర చేస్తోంది ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు మాత్రమే కాదని... వారిని చైతన్యవంతులను చేసేందుకని చెప్పారు. కొందరు ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని, వారిని చైతన్యవంతులను చేసేందుకే పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ఆదర్శ పాలనకు స్వర్గీయ నందమూరి తారక రామారావు, తాను ఉదాహరణ అయితే అస్తవ్యస్థ పాలనకు కాంగ్రెసు పాలన ఉదాహరణ అని అభిప్రాయపడ్డారు.
తన తనయుడు నారా లోకేష్ రాజకీయాల్లోకి వస్తానని చెప్పినప్పుడు తాను ఒకటే విషయం చెప్పానని, నిస్వార్థం, సేవాభావం ఉంటే రావాలని చెప్పానని, నగదు బదలీ పథకం అతని ప్రతిపాదనే అని చంద్రబాబు చెప్పారు. భువనేశ్వరికి రాజకీయాలపై ఆసక్తి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. చదువులేని వాళ్లు పాలసీలు, అనుభవం లేని వాళ్లు పాలిస్తామని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. వారిని చూస్తే నవ్వుకోవడం తప్ప ఏం చేయలేమన్నారు.
పిల్లు కాంగ్రెసు తల్లి కాంగ్రెసు అని తానే పెట్టానన్నారు. తెలంగాణపై తనకు, పార్టీకు, ప్రజలకు క్లారిటీ ఉందని, స్వార్థపరులు ఇంకా క్లారిటీ అడుగుతున్నారని మండిపడ్డారు. కెసిఆర్ పాదయాత్ర చేయాలంటే వేరేవాళ్ల కాళ్లు కావాలన్నారు. తమపై విమర్శలు చేసే వారికి స్వార్థమే తప్ప ప్రజా సమస్యలు పట్టవన్నారు. జగన్ ఎదుగుదల తాత్కాలికమే అన్నారు. తాను చేసిన పొరపాట్లు వైయస్ను ముఖ్యమంత్రిని చేశాయన్నారు. ప్రజల పక్షాన పోరాడటంలో టిడిపియే నెంబర్ వన్ అన్నారు. జగన్ ఎదుగుదల తాత్కాలికమే అన్నారు.