తెలంగాణపై చెప్పలేదు, హైదరాబాద్ చర్చించలేదు:షిండే
నెల రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని చెప్పామన్నారు. అంతేకానీ ఇస్తామనో ఇవ్వమనో తాము చెప్పలేదన్నారు. సమస్య పరిష్కారానికి గడువు ఉందన్నారు. ఆ లోగా తేల్చుతామన్నారు. నెలలోగా అన్న తన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని చెప్పారు. తెలంగాణ అంశంపై చాలామంది నుండి సమాచారం వస్తోందన్నారు. తాను కూడా వివరాలు తెలుసుకుంటున్నానని చెప్పారు. తెలంగాణపై సమాచారాన్ని పరిశీలిస్తున్నామన్నారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేసే అంశంపై చర్చించలేదన్నారు.
మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకున్నామన్నారు. ఢిల్లీలో శాంతిభద్రతలను పరీక్షించామన్నారు. ఢిల్లీలోని ప్రతి పోలీసు స్టేషన్లో మహిళలకు సహాయక కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పోలీసు నైట్ పెట్రోలింగ్ వ్యవస్థను కూడా పెంచామని షిండే చెప్పారు. ఢిల్లీ వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశామన్నారు. రాత్రి వేళల్లో ద్విచక్ర వాహనాల పైన గస్తీ చర్యలు చేపట్టామన్నారు.
భద్రతా చర్యల కోసం మాజీ సైనికులు, ఎన్జీవోల సేవలు వినియోగించుకుంటున్నామని చెప్పారు. నక్సల్స్ తరుచూ తమ దాడి వ్యూహాలను మార్చుకుంటున్నారన్నారు. వారి దాడి వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. మహిళలు, అమ్మాయిలు పాఠశాలలు, కళాశాలలు పూర్తైన తర్వాత నేరుగా ఇంటికే వెళ్లడం మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ పరిధిలో ఉన్న అంశాలపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.