సైకిల్ బాంబులు: పేలుళ్ల వెనక హుజీ ఉగ్రవాద సంస్థ?
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జరిగిన బాంబు పేలుళ్లకు స్థానిక శక్తులకు విదేశీ ఉగ్రవాద సంస్థల సహకారం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2007లో గోకుల్ చాట్, లుంబినీ పార్కు వద్ద జరిగిన బాంబు పేలుళ్లను ఈ పేలుళ్లు గుర్తు చేస్తున్నాయి. గురువారంనాటి పేలుళ్లతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రెండు సైకిళ్లకు బాంబులు అమర్చి పేల్చినట్లు కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే చెప్పారు. పేలుళ్లు జరగవచ్చునని రెండు రోజుల నుంచి సమాచారం ఉందని ఆయన చెప్పారు.
హైదరాబాద్ పోలీసులకు సహకరించేందుకు ఐజి స్థాయి అధికారితో పాటు జాతీయ భద్రతా దర్యాప్తు బృందం ఇప్పటికే హైదరాబాదు చేరుకుందని ఆయన వెల్లడించారు. హైదరాబాద్ పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అర్కే సింగ్ హైదరాబాద్ వెళ్తారని ఆయన చెప్పారు. మక్కా మసీదు పేలుడు తర్వాత స్థానిక యువకుల్లో తీవ్ర నిరాశానిస్పృహలు అలుముకున్నాయనే వార్తలు వున్నాయి.
హర్కత్ - ఉల్ - జుహాదీ ఇస్లామీ (హుజీ) సహకారంతో స్థానిక యంత్రాంగం ఈ పేలుళ్లకు పాల్పడి ఉండవచ్చునని ప్రస్తుతానికి పోలీసులు, నిఘా సంస్థల అధికారులు అనుమానిస్తున్నారు. గోకుల్ చాట్, లుంబినీ పార్కుల పేలుళ్లకు పాల్పడింది హుజీ సంస్థనే. ఇండియన్ ముజాహిదీన్ కన్నా హుజీ హైదరాబాదులో బలంగా ఉందని భావిస్తున్నారు. లష్కరే తోయిబా హస్తం కూడా ఈ పేలుళ్ల వెనక ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. ఇండియన్ ముజాహిదీన్ మీద కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ దుర్ఘటన జరిగిన వెంటనే పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రికి ఈ సంఘటన గురించి వివరాలు అందజేస్తున్నారు. దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి హుటాహుటిన సంఘటన జరిగిన స్థలానికి బయలుదేరి వెళ్లారు. దోషులను వదిలేది లేదని ముఖ్యమంత్రి చెప్పారు.
కసబ్ ఉరి శిక్ష అమలు చేయడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ గతంలోనే లష్కర్ తోయిబా నాయకుడు మహ్మద్ హైదరాబాద్, బెంగుళూరులలో బాంబు పేలుళ్లు జరుపుతామని ముందే హెచ్చరించారు. ఇప్పుడు అలాగే జరగడంతో పోలీసు ఉన్నతాధికారులు ఇంకా మరేమైనా సున్నిత ప్రాంతాలు ఉన్నాయా, మరెక్కడైనా ఇంకా బాంబు పేలుళ్లు జరిగే ప్రమాదం ఉందా అని చాలా జాగ్రత్తగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.