దిల్సుఖ్నగర్ పేలుళ్లు: అదృశ్యమైన వ్యక్తి కాశ్మీర్లో అరెస్ట్
అతని వద్ద నుండి పోలీసులు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అవి ఎపికి చెందినవిగా వార్తలు వస్తున్నాయి. అతను గత నెల(జనవరి) 23 నుండి నగరంలో కనిపించడం లేదని పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. పేలుళ్ల తర్వాత పోలీసులు హైదరాబాదును జల్లెడ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సలావుద్దీన్ నెల రోజులుగా కనిపించడం లేదని తెలుసుకున్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో అతను జమ్మూలో అరెస్టయ్యారు. పేలుళ్లలో అతని పాత్రపై ఆరా తీస్తున్నారు. అతని పాసుపోర్టును స్వాధీనం చేసుకున్నారు.
కిరణ్ను కలిసిన బిజెపి
పేలుడు ఘటనలో గాయపడిన వారికి, మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి బుధవారం హైదరాబాదులో డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిశారు. అనంతరం కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
పేలుడు బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులను త్వరగా పట్టుకోవాలని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లుంబిని పార్క్, గోకుల్ చాట్ పేలుళ్ల కేసుల దర్యాఫ్తు ఏళ్ల పాటు కొనసాగుతోందని ఆరోపించారు. పేలుళ్ల కేసులు దర్యాఫ్తు చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలన్నారు.
ఉగ్రవాద నిరోధానికి పోటా చట్టం తీసుకురావాలని, హైదరాబాదులో అక్రమంగా ఉంటున్న విదేశీయులను వెనక్కి పంపించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పేలుళ్లలో గాయపడ్డ వారికి ప్రభుత్వ ఉద్యోగం, ప్లాట్, రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.