మాట్లాడేది తెలుగు కాదా?: తెలంగాణ తల్లిపై లగడపాటి
తెలుగు భాష, సంస్కృతి క్షీణిస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు తల్లి విగ్రహాలను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భాషా ప్రయుక్తంగా తెలుగు తల్లి విగ్రహాలు పెట్టుకోవాలే తప్ప తెలంగాణ ప్రాంతం పేరిట తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటం విడ్డూరం, వితండ వాదం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రాంతానికో పేరుతో తల్లి విగ్రహాలను పెట్టుకోవటం శోచనీయమన్నారు.
మన మాతృభూమికి ప్రతీకగా కొలుచుకునే భరత మాతలాగానే భాషకో తల్లి విగ్రహాన్ని పెట్టుకోవచ్చని తెలిపారు. తెలుగు తల్లి విగ్రహాల ఏర్పాటు వల్ల భాష, సంస్కృతికి బంధం, అనుబంధం పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఉంటున్న వేర్పాటు వాదులు మాట్లాడేది తెలుగు కాదని అనగలరా? అని ఆయన ప్రశ్నించారు.
పదో తరగతి వరకు విద్యార్థులకు తెలుగు భాషను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందన్నారు. వేర్పాటు వాదుల ఉద్యమం రాష్ట్రంలో ఉగ్రవాద దాడులకు అవకాశం కల్పించినట్లయిందని ఆరో పించారు. వేర్పాటు వాదుల ఉద్యమాలపైనే పోలీసుల దృష్టి పెట్టటం వలనే ఉగ్రవాదుల చొరబాటు మరింత సులువైందని అభిప్రాయపడ్డారు.