శ్రీలంకపై మేం రెడీ, కరుణ ఎందుకు అలా చేశారో?: చిద్దు
శ్రీలంకలో తమిళుల హక్కులను కాపాడుతామన్నారు. ఆ దేశానికి గట్టి సందేశం పంపే తీర్మానం అవసరమని అభిప్రాయపడ్డారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్లో శ్రీలంక వ్యతిరేక తీర్మానంలో సవరణలు అవసరమే అన్నారు. శ్రీలంక వ్యతిరేక తీర్మానంలో సవరణలకు తాము అనుకూలంగానే ఉన్నామన్నారు. సవరణలకు తుది రూపు తీసుకు వస్తున్నామని, ఇలాంటి సమయంలో డిఎంకె వైఖరి ఎందుకు మారిందో తెలియదన్నారు.
శ్రీలంక తమిళుల అంశంపై తమకు డిఎంకె అధినేత కరుణానిధి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత లేఖ రాశారని చెప్పారు. కరుణ లేఖ పైన తాము ఈ నెల 18న చెన్నై వెళ్లి ఆయనతో చర్చించినట్లు చెప్పారు. కాంగ్రెసు పార్టీ పార్లమెంటరీ సమావేశంలో సోనియా గాంధీ శ్రీలంక తమిళుల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారని చెప్పారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనపై నిష్పాక్ష దర్యాఫ్తుకు కూడా సోనియా ఆదేశించారన్నారు.
శ్రీలంకలో మానవ హక్కుల ఉల్లంఘన గర్హణీయమ్నారు. తమిళుల న్యాయమైన హక్కుల కోసం పోరాడుతామన్నారు. శ్రీలంక వ్యతిరేక తీర్మానంలో సవరణల కోసం అందరితో చర్చిస్తున్నామని చెప్పారు. పార్లమెంటులో తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. సభలో బల నిరూపణకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కమల్ నాథ్ అన్నారు. యుపిఏకు పూర్తి మెజార్టీ ఉందన్నారు.
ఇవాళ, రేపు సభకు అందరూ హాజరు కావాలని కాంగ్రెసు పార్టీ ఆదేశించింది. మరోవైపు లోకసభ పన్నెండు గంటలకు వాయిదా పడింది.