టిడిపి ఎమ్మెల్యేల బైఠాయింపు: అర్థరాత్రి తరలింపు
మధ్యాహ్నం నుంచే పోలీసులు అసెంబ్లీ ఆవరణలో మోహరించారు. ఏ క్షణంలోనైనా పోలీసులు టిడిపి ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తారని సూచనలు కనిపించాయి. రాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులు అసెంబ్లీలోకి ప్రవేశించి అన్నీ గేట్లను మూసివేసి ఒక్క గేట్ను మాత్రమే తెరిచి ఉంచారు. విద్యుత్ సరఫరా నిలిపివేసి పోలీసులు టిడిపి సభ్యులను వ్యాన్లలో ఎన్టీఆర్ ట్రస్టు భవన్కు తరలించారు.
చంద్రబాబు ఎప్పటికప్పుడు టిడిపి ఎమ్మెల్యేలకు సూచనలు అందజేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలను ఎక్కడికి తరలిస్తారనే విషయం వారికే అర్థం కాలేదు. రెండు బస్సులు, పలు కార్లలో వారిని తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ - విద్యుత్ సమస్యలపై పోరాటం చేస్తున్న తమను ప్రభుత్వం అమానుషంగా అరెస్టు చేసిందని విమర్శించారు.
ఎక్కడికి తరలంచినా తాము అక్కడే దీక్ష చేపడతామని, అక్కడి నుంచే శనివారం అసెంబ్లీకి వెళ్లతామన్నారు. శనివారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అవలంభించాల్సిన వైఖరిపై చంద్రబాబు తగు సూచనలు చేశారని సమాచారం. శనివారం అసెంబ్లీలో బ్లాక్ పేపర్ను ప్రవేశపెట్టాలని సూచించినట్లు తెలిసింది. తాము ఏమి చేస్తే బాగుంటుందని ప్రజల నుంచి సలహాలను సేకరించాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు ఫోన్ల ద్వారా సూచించినట్లు సమాచారం.