షర్మిల పాదయాత్రలో ఎన్టీఆర్ బ్రదర్: కలిసి నడక
వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు రోడ్డు వద్ద షర్మిలను కలిశారు. ఆమెతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. మలయప్పన్నపేట, నిడమోలు మీదుగా ఆమె పాదయాత్ర తరకటూరు వరకు సాగింది. ఇప్పటి వరకు షర్మిల పాదయాత్ర 108వ రోజుకు చేరుకుంది.
వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే అందరికీ మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. కృష్ణా జిల్లా జిజ్జవరం రచ్చబండ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే 9 గంటలు విద్యుత్తు ఇవ్వడంతో పాటు 30 కెజీల బియ్యం పథకం అమలు చేసేవారన్నారు. రాష్ట్రంలో ఏ వర్గం కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల సంతృప్తిగా లేదని ఆమె అన్నారు. ఈ ప్రభుత్వం చెప్పేదొకటి, చేసేది మరోటి అని షర్మిల అన్నారు.
పేదవాడు మూడు పూటలా పనిచేసినా బతికే పరిస్థితి లేదని ఆమె అన్నారు. రోజుకు ఐదు గంటలు కూడా విద్యుత్తు ఉండడం లేదని మహిళలు షర్మిలకు చెప్పారు. పెన్షన్లు రావడం లేదని, ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని వారు చెప్పారు. విద్యుత్ కోతలు, అధిక బిల్లులు, పెరిగిన చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగి తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నామని వారు వివరించారు.