రథసారథిగా కెసిఆర్: జగన్, బాబులు కౌరవులుగా...
నిజామాబాద్: జిల్లాలోని ఆర్మూర్ మండలం పెర్కిట్లో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర సమితి 13వ ఆవిర్భావ సభ సందర్భంగా వేదిక వెనుక భాగంలో ఆ పార్టీ యువజన విభాగం నాయకుడు బల్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంది. మహాభారత యుద్ధ తరహా ఫ్లెక్సీని ఆయన ఏర్పాటు చేశారు.
పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావును రథసారధిగా పార్టీ ఎమ్మెల్యేలు హరీష్ రావు, కల్వకుంట్ల తారక రామారావు, తెలంగాణ జాగృతి అధ్యక్షులు కల్వకుంట్ల కవితలను పాండవులుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్లను కౌరవులుగా చిత్రీకరించి వారిపై పాండవులు యుద్ధం చేస్తున్నట్టు రూపొందించాడు.
మహిళల రిజర్వేషన్లపై తీర్మానం చేయడమే కాకుండా, టిక్కెట్లూ ఎక్కువగా ఇవ్వాలని మెదక్ ఎంపి విజయశాంతి డిమాండ్ చేశారు. తెరాస ఆవిర్భావ సభలో ఆమె చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మహిళలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, ఏ రంగంలోకి రావాలన్నా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా బిల్లుకు కొన్ని పార్టీలు అడ్డంకులు సృష్టించాయని, అందువల్లే రాజ్యసభలో బిల్లు పాసైనా లోక్సభలో నెగ్గలేదని అన్నారు.
పార్టీల నేతలు తమ మైండ్సెట్ను మార్చుకొని, మహిళా బిల్లుకు మద్దతు తెలపాలని కోరారు. దేశంలో మహిళలకు ప్రస్తుతం రక్షణ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యాచారాల నిరోధానికి చట్టం తెచ్చినా ప్రస్తుతం ఆ చట్టం ఏమైందో ఎవరికీ తెలియడం లేదని ఎద్దేవా చేశారు. చెల్లెలు ఎంత మొండిదో, అన్న కూడా అంతే జగమొండి కావడం వల్లే పార్టీ విజయవంతంగా నడుస్తోందని చమత్కరించారు.