సభ నుంచి తెరాస, వైయస్సార్సీపి ఎమ్మెల్యేల సస్పెన్షన్
తెలంగాణ తీర్మానం ప్రతిపాదించాలని తెరాస సభ్యులు ఆందోళనకు దిగారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి సంబంధించి ఎంజిఎం వ్యవహారంపై చర్చ చేపట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు పట్టుబట్టారు. ఎంజిఎం వ్యవహారంలో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు స్పీకర్ పోడియం వద్ద గుమికూడి ఆందోళనకు దిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులకు పోటీగా తెలుగుదేశం పార్టీ సభ్యులు కూడా స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఇరు పార్టీ శానససభ్యులు పోటీ పడి నినాదాలు చేశారు. వైయస్సార్పీ గజదొంగల పార్టీ అని టిడిపి సభ్యులు ఆరోపించారు. ఈ స్థితిలో మొదట శానససభ అర గంట పాటు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత సభ అదుపులోకి రాకపోవడంతో తెరాస, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శానససభ్యులను సస్పెండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ తీరుపై తెరాస శానససభ్యుడు హరీష్ రావు సస్పెన్షన్ అనంతరం తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీపై, తమ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై మాట్లాడే హక్కు తెలుగుదేశం పార్టీకి లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణ పదాన్ని సభలో వాడకుండా చంద్రబాబు నిషేధించారని ఆయన అన్నారు.
సభ్యులు సస్పెన్షన్కు గురి కావడానికి ప్రభుత్వమే మూలకారణమని సిపిఐ సభ్యుడు సాంబశివరావు సభలో విమర్శించారు. తెలంగాణపై ఇచ్చిన హామీని కాంగ్రెసు తుంగలో తొక్కిందని ఆయన అన్నారు. మూడేళ్ల నుంచి సభ సక్రమంగా జరగడం లేదని ఆయన అన్నారు. సభ్యులను ఉదయంపూటనే సస్పెండ్ చేసి ఉంటే సభా కార్యక్రమాలు జరిగి ఉండేవని సిపిఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.