చదువు కోసం ఆ చిన్నారుల సాహసం ... నిత్యం వాగు దాటుతూ ఎంతో కష్టం
విద్యార్థులు చదువుకోవడం కోసం అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు, వివిధ గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించడంలో మాత్రం విఫలమవుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకోవడం కోసం విద్యార్థులు సాహసాలు చేయాల్సిన పరిస్థితి అనంతపురం జిల్లాలో కనిపిస్తుంది.
స్కూల్ కు వెళ్ళాలంటే వాగులు, వంకలు దాటాల్సిందే
అనంతపురం జిల్లాలోని అనంతపురం మండల పరిధిలో జాడ్రపల్లి గ్రామంలో విద్యార్థులు ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే వంక నీటి ప్రవాహాన్ని దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇక వీరు మాత్రమే కాదు సింగనమల మండలం పోతురాజు కాలవ గ్రామానికి చెందిన చిన్నారులు కూడా వాగు దాటి బడికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి రోజూ స్కూల్ కి వెళ్లాలంటే వాగులు, వంకలు దాటుతూ సాహసాలు చేస్తూ బడికి వెళ్లాల్సిన పరిస్థితి అక్కడి విద్యార్థులకు ఇబ్బందికరంగా మారింది. తమ చదువు కష్టాలు పరిష్కరించాలని విద్యార్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
నిత్యం వాగు దాటుతూ బడికి .. భారీ వర్షాలు కురిస్తే మరింత కష్టం
అనంతపురం మండలం జాడ్రపల్లి గ్రామంలో 300 మంది జనాభా నివసిస్తున్నారు . ఈ గ్రామ విద్యార్థులు పంచాయతీ కేంద్రమైన వైబిహళ్ళి ఉన్నత పాఠశాల కు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. వర్షాలు కురిసి వాగులు పొందడంతో రెండు నెలల నుంచి విద్యార్థులు వాగును దాటుతూనే స్కూల్ కు వెళుతున్నారు. ఈ గ్రామం నుంచి వైబిహళ్ళి కి వెళ్లేందుకు మూడుసార్లు ఉన్నప్పటికీ ఒకటి వన్యప్రాణుల సంచరించే కొండప్రాంతం కావడంతో ఆ దారిలో వెళ్లడానికి విద్యార్థులు భయపడుతున్నారు. మరొక మార్గంలో వెళ్లాలంటే దాదాపు నాలుగైదు కిలోమీటర్ల దూరం నడవాల్సి ఉంటుంది. దీంతో విద్యార్థులు గత్యంతరం లేక వాగు దాటుతూ స్కూల్ కు వెళుతున్నారు. ఇక భారీ వర్షాలు కురిస్తే మారిత కష్టంగా వారు స్కూల్ కు వెళ్ళాలి. లేదంటే స్కూల్ మానెయ్యాలి.
పిల్లల చదువులకు ఇబ్బంది లేకుండా రోడ్డు కోసం గ్రామస్తుల విన్నపం ..
జాడ్రపల్లి, పత్తికుంట గ్రామాల రైతులు సైతం పొలాలకు వెళ్లాలంటే ఈ మార్గంలోనే వెళ్లాల్సిన పరిస్థితి. అయితే వంక ప్రవాహం ఎక్కువైతే ప్రమాదాలు జరిగే పరిస్థితులు ఉన్నాయని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచించాలని, రహదారి సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో చాలా గ్రామాలలో విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా తక్షణం రహదార్ల సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.