ఆధార్కార్డుంటేనే విమాన టిక్కెట్లు, మూడు విమానాశ్రయాల్లో పైలెట్ ప్రాజెక్ట్
బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు, ఫోన్ నెంబర్లకే కాదు ఇక విమానంలో ప్రయాణం చేయాలంటే కూడ ఆధార్ కార్డు అనివార్యంగా మారనుంది. విమాన టిక్కెట్ల కోసం ఆధార్ను తప్పనిసరి చేయనున్నారు.
విజయవాడ: బ్యాంకు ఖాతాలు, సంక్షేమ పథకాలు, ఫోన్ నెంబర్లకే కాదు ఇక విమానంలో ప్రయాణం చేయాలంటే కూడ ఆధార్ కార్డు అనివార్యంగా మారనుంది. విమాన టిక్కెట్ల కోసం ఆధార్ను తప్పనిసరి చేయనున్నారు. అయితే తొలుత ప్రయోగాత్మకంగా కోల్కతా, అహ్మదాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ఈ విధానం అమల్లోకి తీసుకురానున్నారు.
ఆధార్ కార్డును ప్రతి దానికి అవసరం లేదని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా కానీ, ప్రభుత్వాలు ఆధార్ను మాత్రం ప్రతిదానికి అనుసంధానం చేయాలని నిబంధనలు విధిస్తున్నాయి.
ఆధార్ కార్డులతో మొబైల్ సిమ్ లింక్: మరింత సమయం కోరిన టెలికం ఆపరేటర్లు
అయితే మొబైల్ ఫోన్ సిమ్ కార్డులు ఆధార్తో అనుసంధానం చేయడానికి గాను వచ్చే ఏడాది ఫిబ్రవది మాసం వరకు గడువు విధించారు. అయితే తాజాగా విమానంలో ప్రయాణించాలంటే కూడ ఆధార్కార్డు తప్పనిసరికానుంది.
విమానంలో ప్రయాణించాలంటే ఆధార్ తప్పనిసరి
ఆధార్ నంబర్ అనుసంధానంతో బుక్ చేసుకునే రైల్వే టికెట్ల సంఖ్యను పెంచింది. తాజాగా విమాన టికెట్లు బుక్ చేసుకునేందుకు ఆధార్ను తీసుకొస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు విమానాశ్రయాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయనున్నారు. కోల్కతా, అహ్మదాబాద్, విజయవాడ ప్రాంతాల్లోని విమానప్రయాణికులకు ఈ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
ఆధార్ నెంబర్ ఇస్తే చాలు
విమాన టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ నంబర్ ఇవ్వడం వల్ల విమానాశ్రయానికి వచ్చే సమయంలో ఎటువంటి గుర్తింపు కార్డు లేకపోయినా.. లోపలికి ప్రవేశించవచ్చు. ప్రయాణికుడు విమానాశ్రయ ప్రవేశ ద్వారం వద్ద టచ్ ప్యాడ్పై బొటనవేలు ఉంచితే.. ప్రయాణికుడు ఏ విమానానికి టికెట్ బుక్ చేసుకున్నాడో తెలిపే పూర్తి సమాచారం వస్తుందని అధికారులు ప్రకటించారు.
విమానాశ్రయాల్లో బయో మెట్రిక్
ఆధార్తో విమాన టిక్కెట్లను బుక్ చేసుకొనే విధానం కోసం విమానశ్రయాల్లో బయోమెట్రిక్ యాక్సెస్ను అందుబాటులోకి తేనున్నారు.ఈ విధానం ద్వారా ప్రయాణీకులకు సమయం తగ్గే అవకాశం ఉంటుంది. ప్రవేశద్వారం వద్ద వేచి చూసే అవకాశం ఉండదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
బార్ కోడ్ చూపితే వివరాలు
ఐడీ కార్డులు పేపర్ టికెట్లు, బోర్డింగ్ కార్డులు చూపించడం వంటి వాటి అవసరం లేకుండా పోతోంది. విమానాశ్రయంలోకి ప్రవేశించే సమయంలో ఈ-గేట్ వద్ద టికెట్ మీద ఉన్న బార్ కోడ్ను చూపితే చాలు టిక్కెట్టు కొనుగోలు చేసిన వ్యక్తి పూర్తి సమాచారం తెలుస్తోంది. టికెట్ సమాచారం, ఆధార్ సమాచారం కనిపిస్తుంది. ప్రయాణికుడి వివరాలు, బయోమెట్రిక్ సమాచారం సరిపోలిన తర్వాత ఈ-గేట్ తెరుచుకుంటుంది.