వీడిన సస్పెన్స్: ఎట్టకేలకు ఎపికి ప్రత్యేక హోదా
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)కు ప్రత్యేక హోదా కల్పించే విషయంపై సస్పెన్స్ వీడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని ప్రణాళిక సంఘం పరిశీలిస్తోందని ప్రణాళిక మంత్రి ఇందర్ జిత్ సింగ్ చెప్పారు. రాజ్యసభకు రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఆయన ఈ విషయం చెప్పారు.
ప్రణాళిక సంఘంలో ఆంధ్రప్రదేశ్ కోసం 2014 మార్చి 25వ తేదీన ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసినట్లు, సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీకి అవసరమైన ముందస్తు చర్యలు తీసుకోవడానికి దాన్ని ఏర్పాటు చేసినట్లు సింగ్ చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవలే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయింది. సీమాంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశం 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ చట్టంలో లేదని, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన స్పెషల్ సెల్ను ఏర్పాటు చేసే అంశం కూడా లేదని, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చే విషయం కూడా లేదని ఆయన వివరించారు
రాజ్యసభలో ఫిబ్రవరి 20వ తేదీన బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ అధ్యక్షతన సీమాంధ్రలోని వెనకబడిన ప్రాంతాలకు బుందేల్ఖండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యేకమైన సెల్ ఏర్పాటు చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని గత ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రణాళికా సంఘాన్ని ఆదేశించినట్లు చెప్పారు. సంబంధిత మంత్రులతో చర్చించి సీమాంధ్ర ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రతిపాదనలు పంపిస్తే వాటి ఆధారంగా వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే విషయంపై చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.