ఖరారుకాని అమరావతి డిజైన్లు ,సిఆర్డీఏ లో రియల్ వ్యాపారాలకు ఊతం, కారణమిదే
డిజైన్ల ఖరారులో జాప్యం కారణంగా రాజధాని అమరావతి నిర్మాణంలో ఆలస్యమౌతోంది. రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు, ఐకానిక్ భవనాల డిజైన్లు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో రాజధాని నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.
అమరావతి:డిజైన్ల ఖరారులో జాప్యం కారణంగా రాజధాని అమరావతి నిర్మాణంలో ఆలస్యమౌతోంది. రాజధాని ప్రాంతంలోని ప్రభుత్వ భవనాలు, ఐకానిక్ భవనాల డిజైన్లు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. దీంతో రాజధాని నిర్మాణ పనులు కొలిక్కి రాలేదు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులను వేగంగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నప్పటికీ డిజైన్ల ఖరారు ఇంకా పూర్తి కాకపోవడంతో నిర్మాణ పనులు ఇంకా మొదలు కావడం లేదు. డిజైన్లకు సంబంధించి ఇప్పటికే రెండు కంపెనీలు చేపట్టాయి.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిజైన్లను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో సహ ఎమ్మెల్యేలు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా తిలకించారు. అయితే అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని ప్రకటించాడు బాబు.
కాని, డిజైన్ల కోసమే దాదాపుడ మూడేళ్ళు పట్టింది. పుణ్య కాలం కాస్తా డిజైన్ల తయారీకే సరిపోయిందనే విమర్శలు కూడ లేకపోలేదు.అయితే ఇంకా రెండేళ్ళ సమయం ఉంది.అయితే ఈ రెండేళ్ళ సమయంలో నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందా అనేది ప్రశ్నార్థకమే.
డిజైన్ల తయారీలో జాప్యమెందుకు?
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబునాయుడు రాజధాని నిర్మాణపై కేంద్రీకరించారు. అయితే ఈ మేరకు రైతుల నుండి సుమారు 30 వేలకు పైగా భూమిని సేకరించారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు భూములు ఇచ్చారు.అయితే భూసేకరణ జరిగినా, నిర్మాణాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు పూర్తి కాని కారణంగానే నిర్మాణ పనులను ప్రారంభించలేదని అదికారులు చెబుతున్నారు.900 ఎకరాల్లో ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ , హైకోర్టు, అసెంబ్లీ భవన నిర్మాణాలకు సంబంధించి తొలుత జపాన్ కు చెందిన మాకీ సంస్థను కన్సల్టెంట్ గా నియమించారు.ఈ సంస్థ రూపొందంచిన డిజైన్లపై విమర్శలు రావడంతో ఈ కన్సల్టెన్సీని ప్రభుత్వం రద్దు చేసింది.తాజాగా లండన్ కు చెంది నార్మన్ పోస్టర్ అనే సంస్థకు డిజైన్ల బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.గతంలో వచ్చిన విమర్శలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది.డిజైన్ల ఖరారుకు ప్రత్యేక శ్రద్ద తీసుకొంటోంది.ఈ కారణంగానే డిజైన్ల ఖరారు ఆలస్యమౌతోందని అధికారులు చెబుతున్నారు.
నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించిన బాబు
డిజైన్ల రూపకల్పన సందర్భంగా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. అయితే అదే సమయంలో ఐఐటి, ఎన్ఐటీ తో పాటు వివిధ రంగాలకు చెందిన నిపుణుల సలహాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. దీంతో డిజైన్ల ఖరారు ప్రక్రియ ఆలస్యం అవుతోంది. అయితే ఇటీవలే డిజైన్ల ప్రక్రియ ఎంతమేరకు వచ్చిందనే విషయాన్ని మంత్రి నారాయణతో పాటు అధికారుల బృందం లండన్ వెళ్ళి పరిశీలించి వచ్చారు. ప్రాధమిక డిజైన్లు దాదాపుగా ఖరారయ్యాయని అధికారులు చెబుతున్నారు.ఈ ఏడాది మే చివరి నాటికి కూడ డిజైన్ల ప్రక్రియ పూర్తయ్యే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2018 నాటికి నిర్మాణ పనులు కొలిక్కి వచ్చేనా?
డిజైన్ల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. నిర్ణీత కాలవ వ్యవధిలో డిజైన్లు పూర్తయితే 2018 నాటికి నిర్మాణ పనులు కొలిక్కి వచ్చే అవకాశాలు ఉండేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే డిజైన్ల ప్రక్రియ ఇంకా తేలనందున నిర్మాణ పనులు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు లేకపోలేదు.
రాజధాని ప్రాంతంలో ఊపందుకోనున్న నిర్మాణాలు
అమరావతి ప్రాంతంలో భవన నిర్మాణాలు ఇక జోరందుకోనున్నాయి.సిఆర్ డిఏ ఆంక్షల కారణంగా చాలా కాలంగా లే అవుట్లు, భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వెలుపల 500 చదరపు మీటర్ల పై బడిన విస్తీర్ణంలో అభివృద్ది చేసిన లే అవుట్లను కొన్ని నిబంధలనల మేరకు అనుమతించనున్నారు.
ఎకరాకు లక్ష చొప్పున లేఅవుట్ డెవలప్ మెంట్ పన్ను వసూలు
అమరావతి ప్రాంతంలో నిర్మాణాల విషయంలో మంత్రులు నారాయణ, యనమల రామకృష్ణుడు, నారా లోకేష్ మంగళవారం నాడు సమావేశమయ్యారు.ఇప్పటివరకు 500 చ.మీ. లోపు లే అవుట్లకు సిఆర్ డి ఏ అనుమతులు మంజూరు చేస్తోంది. లే అవుట్లకు సంబంధించిన వీధీ దీపాలు, మురుగు కాలువలు, రోడ్లు, తదితర మౌలిక సదుపాయాలకు సిఆర్ డీ ఏ బాధ్యత వహిస్తోంది. ఈ మేరకు ఎకరాకు లక్షరూపాయాలను లే అవుట్ అభివృద్ది చేసిన వారి నుండి వసూలు చేస్తోంది. 500 చ.మీ. మించిన లే అవుట్లకు మాత్రం ఇప్పటివరకు అనుమతులు ఇవ్వడం లేదు.దీంతో ఇన్నర్ రింగ్ రోడ్డు వెలుపల రియల్ ఏస్టేట్ వ్యాపారాలు ఊపందుకోలేదు.1255 ఎకరాల్లో 99 లే అవుట్లను కొంతకాలంగా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఈ లే అవుట్లకు అనుమతులు మంజూరు చేయాలని మంత్రుల బృందం క్యాబినెట్ కు సిఫారసు చేసింది.
ఖజానాకు ఆదాయం
మౌలిక సదుపాయాలను ఆయా లే అవుట్ల అభివృద్దిదారులే కల్పించాల్సి ఉంటుంది. లే అవుట్ల మంజూరు నిలిపివేత, రాష్ట్ర ఖజానాపై తీవ్ర ప్రభావం చూపింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పడిపోవడమే కాకుండా ఉపాధి,ఆర్థిక కార్యకలాపాలు కూడ ప్రభావితం కావడాన్ని ప్రభుత్వం గమనించింది. దీంతో ఈ ప్రాంతంలో రియల్ ఏస్టేట్ రంగానికి ఊతమిచ్చేలా రాష్ట్ర ఖజనాకు మేలు చేసేలా నిర్ణయం తీసుకొన్నారు. పట్టణాభివృద్ది సంస్థల పరిధిలో ఒకే విధమైన నిబంధనలు రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది.