నేను గూండాయిజం చేస్తే.. వారి చేతులుండేవా?: ఫ్లెక్సీల రగడపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్
నెల్లూరు: వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు సిటీలో ఇకపై ఎవరైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చని అన్నారు. గత రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీ రహిత నగరంగా నెల్లూరు సిటీని ఉంచగలిగామని అన్నారు. ఫ్లెక్సీలు కట్టొద్దంటూ కొందరు అనసవర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎవరికీ లేని బాధ నాకెందుకు?: అనిల్ కుమార్ యాదవ్
ప్రతిపక్షాలతోపాటు తమ పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేశారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు? అని ప్రశ్నించుకున్న ఆయన.. ఇకపై ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనలు లేవన్నారు. దీనిపై తనకు ముఖ్యమంత్రి నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. ప్రమాణపూర్తిగా ఇది తన నిర్ణయమేనని అన్నారు.
నేను గూండాయిజం చేస్తే వారి చేతులుండేవా?: అనిల్ యాదవ్ సంచలనం
అంతేగాక, మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిల్ కుమార్ యాదవ్ గూండాయిజం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారని..తాను గనక గూండాయిజం చేస్తే ఫ్లెక్సీలు కట్టినవారి చేతులు ఉండేవా? అని ప్రశ్నించారు. అలాంటివి తాను చేయనని అన్నారు. నెల్లూరు సిటీలో గతంలో తన ఫ్లెక్సీలు కట్టలేదని.. ఇకపై కట్టేది లేదని అన్నారు. ఏ పార్టీ నేతలైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చన్నారు. అయితే, తన ఫ్లెక్సీలు మాత్రం కట్టేది లేదన్నారు. ఎవరైనా తన ఫ్లెక్సీలు కడితే తానే తీసేస్తానన్నారు అనిల్ కుమార్ యాదవ్.
నెల్లూరులో ఫ్లెక్సీల రగడతోనే అనిల్ యాదవ్ ఇలా
కాగా, ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలతోపాటు అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు కూడా తొలగించడంపై నెల్లూరులో రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార వైసీపీ రాజ్యసభసభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో అభిమానులు, అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని అధికారులు తొలగించారు. అదే సమయంలో దివంగత నేత ఆనం వివేకానందరెడ్డి జయంతి పురస్కరించుకుని నెల్లూరు నగరంలో పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కూడా మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లెక్సీల తొలగింపు విషయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్పై ఇటు ప్రతిపక్ష నేతలోపాటు కొందరు సొంత పార్టీ నేతలు కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.