ఎవరు తక్కువ- ఎక్కువ కాదు : న్యాయ - శాసనాధికారాలపై : అసెంబ్లీలో బిగ్ డిబేట్..!!
ఏపీ శాసనసభలో కీలక అంశం పైన చర్చ జరుగుతోంది. న్యాయ వ్యవస్థ - శాసనసభ అధికారాల పరిధి పైన చర్చ జరుగుతోంది. మూడు రాజధానుల వ్యవహారం పైన ఈ నెలలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయాలని.. రాజధాని మార్పు రాష్ట్ర విభజన అంశానికి ముడి పడి ఉందని..రాష్ట్రపతి ఆమోదంతోనే రాజధాని మార్పు సాధ్యమని హైకోర్టు పేర్కొన్నట్లుగా పిటీషనర్ల తరపు న్యాయవాదులు చెప్పుకొచ్చారు.
Recommended Video
ఆ సమయంలోనే వైసీపీ సీనియర్ నేత ధర్మాన సీఎం జగన్ కు లేఖ రాసారు. తాను హైకోర్టు తీర్పును తప్పు బట్టటం లేదని చెబుతూనే.. న్యాయ వ్యవస్థ - శాసనసభ అధికారాల పరిధి పైన అవసరమని కోరుతూ లేఖలో పేర్కొన్నారు. ఇక, ఈ రోజు అసెంబ్లీలో ఇదే అంశం పైన చర్చ మొదలైంది.
సమాన హక్కులు - అధికారాలు
జ్యుడీషియల్ యాక్టివిజం పేరుతో కోర్టులు విధులు నిర్వహించరాదని చెప్పిందని ధర్మాన చెప్పుకొచ్చారు. అధికార వ్యవస్థ విధుల్లో కోర్టులు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ప్రస్తావించిన అంశాన్ని ధర్మాన పేర్కొన్నారు. ఒకవేశ శాసన వ్యవస్థ సరిగా పనిచేయకుంటే అది ప్రజలు చూసుకుంటారన్నారు.
ఎంత నిగ్రహంతో కోర్టులు వ్యవహరించాలో కూడా సుప్రీంకోర్టు చెప్పిందని ధర్మాన గుర్తు చేసారు. ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ కాదు అన్న విషయాన్ని కోర్టులు గుర్తుపెట్టుకోవాలని సభలో చెప్పుకొచ్చారు. మూడు వ్యవస్థలను సమానమైన హక్కులు, అధికారాలు ఉన్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థకు ముప్పు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కోర్టులదే అని చెప్పాయి. లేని అధికారాలను కోర్టులు సృష్టించుకోలేవని సుప్రీం తీర్పుల్లో స్పష్టంగా ఉందంటూ ధర్మాన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీకి పరిమితులు ఎలా
రాజ్యాంగం తమను కాపాడుతుందన్న భరోసాలో ప్రతీ ఒక్కరు ఉంటారన్నారు. ఎవరి పరిధి ఏంటనే అంశం పైన..అదే సమయంలో ఎవరి విధులేంటీ అనే దాని పై స్పష్టత రావాలని పేర్కొన్నారు. ఈ స్పష్ట రాకుంటే వ్యవస్థలో గందరగోళం వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వానికి చట్టాలు చేసే అధికారం లేకపోతే అసలు ఎన్నికలు దేనికి.. ప్రభుత్వం మారటం ఎందుకని ప్రశ్నించారు.
ఏపీ అసెంబ్లీకి కొన్ని పరిమితులను పెడుతూ హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని..దీనిపై సభలో చర్చించాల్సిన ఆవశ్యకత ఉందని భావిస్తున్నానని చెప్పారు. న్యాయ.. కార్యనిర్వాహక.. శాసన వ్యవస్థలు వేటికవే వ్యవహరించాలని పేర్కొన్నారు. కోర్టులంటే అందరికి గౌరవం ఉందన్నారు.
యూపీఎస్సీ తరహాలో న్యాయమూర్తుల ఎంపిక
ప్రజాభిప్రాయం కేవలం శాసన వ్యవస్థలోనే ప్రభావితం అవుతుందని ధర్మాన చెప్పుకొచ్చారు. శాసనసభ, లోక్సభ.. ఈ రెండు వ్యవస్థలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారని చెప్పుకొచ్చారు. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారు..కాలేరని ధర్మాన సభా వేదికగా స్పష్టం చేసారు. సీనియర్ ఎమ్మెల్యే పార్దసారధి... న్యాయవాది అయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఇదే అంశం పైన సభలో మాట్లాడారు. కొలీజియం వ్యవస్థ గురించి చెవిరెడ్డి ప్రస్తావించారు. యూపీఎస్సీ తరహాలోనే న్యాయమూర్తుల ఎంపిక జరగాలని అభిప్రాయపడ్డారు. దేశానికి రాజ్యంగమే సుప్రీం అని చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ చర్చ తరువాత సీఎం మాట్లాడుతారా.. ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి కర అంశంగా మారింది.