కెసిఆర్కు షాక్: కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే, సీటు రిజర్వ్కోసం
న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అదిలాబాద్ జిల్లా మంచిర్యాల శాసన సభ్యులు అరవింద్ రెడ్డి పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖర రావుకు షాక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. అరవింద్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీలో మూడు రోజులుగా ఉంటూ కాంగ్రెసు కీలక నేతలతో చర్చలు జరిపారట. ఆ తర్వాత గురువారం రాష్ట్రానికి వచ్చారు. మొదటి నుండి ఆయన కాంగ్రెసు పార్టీతో స్నేహంగా ఉంటున్నారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అరవింద్ రెడ్డి కాంగ్రెసులో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు కాంగ్రెసు పార్టీ తెలంగాణను ఇస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరాలని భావిస్తున్నారట. కెసిఆర్తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారంటున్నారు.
మరోవైపు ఎపి కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ను కలిసేందుకు, సీటును రిజర్వ్ చేసుకునేందుకు అరవింద్ రెడ్డి గురువారం ప్రయత్నాలు చేశారట. డిగ్గీని కలిసేందుకు ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో అతను లేకపోవడంతో అరవింద్ రెడ్డి కలవలేకపోయారు. రాబోయే ఎన్నికల్లో తనకు సీటు ఇస్తామని హామీ ఇస్తే పార్టీలో చేరతానంటూ కాంగ్రెస్ పార్టీ పెద్దలు దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్, వయలార్ రవి, గులాంనబీ ఆజాద్లను కలిసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తనతో పాటు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది.
ముందే తెలుసు
అరవింద్ రెడ్డి కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని తాము మొదటి నుండి ఊహించిందేనని తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి. అందులో వింత ఏమీ లేదని అంటున్నారు.
అరవింద్ రెడ్డి అసెంబ్లీకి గైర్హాజరవుతుండటంపై ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అరవిందరెడ్డి నాలుగు రోజులుగా సభకు రావడం లేదని, ఎక్కడికి వెళ్లాడో ఎవరిని కలిశాడో ఎక్కడ ఉన్నాడో తెలియదన్నారు. వెళ్లే ముందు పార్టీ శాసనసభాపక్ష నేతగా తనకు ఒక్క మాట కూడా చెప్పలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు రావాలంటూ ఫోన్ చేస్తే ఇక్కడే (హైదరాబాద్లో) ఉన్నానని చెబుతున్నాడని, సభకు మాత్రం రావడం లేదన్నారు.
తెలంగాణకు అనుకూలంగా సిడబ్ల్యూసి తీర్మానం చేసిన వెంటనే, కాంగ్రెస్లో తెరాస విలీనం కోసం అరవింద్ రెడ్డి ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. తనతోనే ఆ విషయం చెప్పారని, తొందరెందుకని, బిల్లు ఆమోదం పొందాక చూద్దామని చెప్పానని, ఆయన ఇది వరకే ఓసారి కాంగ్రెస్ పార్టీ గడపదాకా వెళ్లి వచ్చారన్నారు. ఈ సమయంలో పార్టీ మార్పు నిర్ణయం ఆయనకే నష్టం చేస్తుందని, రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనటానికి ఇది నిదర్శనమన్నారు.