కెసిఆర్కి షాక్: కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే, విలీనమైతే చిరులా
2009లో మొట్టమొదటిసారి తెరాస నుంచి మంచిర్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన అరవింద్ రెడ్ది అనంతరం పార్టీ ఆదేశం మేరకు రాజీనామా చేసి ఉప ఎన్నికలో డెబ్బై వేల పైచిలుకు మెజార్టీతో గెలిచారు. తెరాసను వెంటనే కాంగ్రెస్లో విలీనం చేయాలన్నారు. విలీనంపై కెసిఆర్ మాట నిలబెట్టుకోవాలని సూచించారు.
విలీనంపై ఉత్కంఠ
విభజనకు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం లభించిన తర్వాత ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిల వైపు మళ్ళింది. కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనమా? లేక ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకుని మిత్రపక్షంగానే ఉంటుందా? అనే అంశం చర్చనీయాంశమైంది. దిగ్విజయ్ సింగ్ బుధవారం ఢిల్లీలో మాట్లాడుతూ కాంగ్రెస్తో టిఆర్ఎస్ విలీనంపై కెసిఆర్ సంకేతం ఇచ్చారని, విధి విధానాలు ఖరారు కావాల్సి ఉందని చెప్పడంతో కాంగ్రెస్ వర్గాల్లో కూడా ఆందోళన నెలకొంది.
విలీనానికి కెసిఆర్ పెట్టే షరతులను ఏకపక్షంగా పార్టీ హైకమాండ్ అంగీకరిస్తే తమ సీట్లకు ఎక్కడ ఎసరు పెడతారేమోనన్న భయం కాంగ్రెస్ను వెంటాడుతోంది. ఈ ఆందోళన కాంగ్రెస్ ఎంపీలపై తీవ్రంగా ఉంది. కాంగ్రెస్, తెరాసలు తీసుకునే నిర్ణయం తెలంగాణలో రాజకీయాలపై ప్రభావం పడుతుంది. తెరాసతో పొత్తు లేదా విలీనం ఏదైనా తమకు సంకటమేనని, ఇది తెలంగాణలో పటిష్టంగా ఉన్న కాంగ్రెస్ రాజకీయాలపై పెనుప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
విలీనమైతే కాంగ్రెస్ను శాసించే విధంగా సర్వాధికారాలు కెసిఆర్కు అప్పగించే పరిస్ధితి నెలకొంటుందని, అదే పొత్తు అయితే మెజార్టీ సీట్లకు తెరాస డిమాండ్ చేస్తుందని కాంగ్రెసు భావిస్తోంది. మరోవైపు, పొత్తు కుదుర్చుకోకుండా నేరుగా విలీనం చేస్తే కాంగ్రెస్లో తమ పార్టీకి గుర్తింపు లేకుండా పోతుందనేది తెరాస వర్గాల ఆందోళనగా ఉంది. విలీనం చేసిన రెండు, మూడు రోజులే హడావుడి ఉంటుందని, ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరని, కెసిఆర్ సహా పార్టీ ముఖ్య నాయకులంతా ద్వితీయ శ్రేణి నాయకులవుతారని వారంటున్నారు.
లోగడ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన ప్రస్తుత కేంద్రమంత్రి చిరంజీవి కూడా పార్టీని విలీనం చేసిన తర్వాత నామమాత్రంగా మిగిలి పోయారని వారు చెబుతున్నారు. విలీనం చేయకపోతేనే బయట ఉండి కాంగ్రెస్ను ఆడించేందుకు అవకాశం ఉంటుందని వారంటున్నారు. పొత్తు కుదుర్చుకుని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయాలని, ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తూ, అవసరమైతే మంత్రివర్గంలోనూ చేరి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలని తెరాస వర్గాలు పార్టీ నాయకత్వానికి సూచిస్తున్నారు.