జగన్పై భూమా అసంతృప్తి: టైంకు చక్రం తిప్పిన బాలకృష్ణ, లోకేష్
కర్నూలు: కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, ఆయన కూతురు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియలు సోమవారం రాత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయ్యారు.
అయితే భూమా కుటుంబం టిడిపి తీర్థం పుచ్చుకోవడం వెనుక హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ చక్రం తిప్పినట్లుగా తెలుస్తోంది. గతంలో జరిగిన పలు వ్యవహారాలతో విసిగిపోయిన భూమా నాగిరెడ్డి కొంత కాలంగా జగన్ పైన, పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో పలుసార్లు ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు జోరుగా వినిపించాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో చాలా రోజులుగా ఈ ప్రచారం సాగింది. గతంలో కర్నూల్ జిల్లాలో జరిగిన కో ఆపరేటివ్ ఎన్నికల్లో వైసిపికి చుక్కెదురైంది. ఆ విషయంలో భూమాను జగన్ తప్పుపట్టారు.
దీంతో, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పైన భూమా అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో బాలకృష్ణ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. వైసిపి నుంచి బయటకు వెళ్లాలని ఆయన తన సన్నిహితులతో చెబుతూ వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో భూమాను టిడిపిలోకి లాగేందుకు మంతనాలు జరిగాయి. బాలకృష్ణ, నారా లోకేష్లు భూమాతో సత్సంబంధాలు నెరిపి ఆయన టిడిపి తీర్థం తీసుకునేలా చేశారని తెలుస్తోంది. గతంలో భూమా చేరిక పైన వార్తలు వచ్చినప్పుడు ఆయన ఖండించారు. ఈసారి మాత్రం ఖండించలేదు. దీంతో ఆయన చేరిక ఖాయమని తేలింది.
చివరకు సోమవారం రాత్రి టిడిపిలో చేరారు. ఈ సందర్భంగా భూమా మాట్లాడుతూ... శోభా నాగిరెడ్డి ఉన్నా కూడా టిడిపిలో చేరేవారని చెప్పారు. చంద్రబాబు వల్లే అభివృద్ధి సాధ్యమన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి ముఖ్యమని చెప్పారు. ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ... తమ చేరికతో ఇప్పటికే ఉన్న టిడిపి నేతలకు ఇబ్బంది రాకుండా చూస్తామని, తాము సర్దుకుపోతామన్నారు.
చంద్రబాబు వెంటే ఉంటా: రామసుబ్బా రెడ్డి
తాను అవకాశవాదిని కానని జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బా రెడ్డి అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ... కేడర్ సమస్యలు ముఖ్యమంత్రి బాబుకు వివరించానన్నారు. జమ్మలమడుగులో పార్టీ కేడర్కు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకుంటానని, అన్ని వేళలా అండగా ఉంటానని చెప్పారన్నారు.
దీనిని అవకాశంగా తీసుకుని తాను పదవిని ఆశించడం లేదన్నారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానన్నారు. అలాగే తనపై నమ్మకంతో ఆయన ఏ బాధ్యత అప్పగించినా దానిని నిర్వర్తిస్తానన్నారు. తాము పార్టీలో కొత్తగా చేరిన వాళ్లం కాదని, పార్టీని నమ్ముకుని ఎంత కాలంగా ఉన్నామో ముఖ్యమంత్రికి తెలుసన్నారు.