బుల్లెట్ నడిపి బాలకృష్ణ హల్చల్: బాలయ్య వచ్చినప్పటి నుంచి.. సునీత
హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి బుల్లెట్ నడిపి వారిని ఉత్సాహపరిచారు.
హిందూపురం: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ శుక్రవారం సందడి చేశారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి బుల్లెట్ నడిపి వారిని ఉత్సాహపరిచారు. ఉదయం చిల్లమత్తూరుకు చేరుకున్న బాలకృష్ణకు టిడిపి నాయకులు, ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు.
అభిమానుల కేరింతల మధ్య అక్కడి నుంచి బుల్లెట్పై ర్యాలీగా హిందూపురానికి చేరుకున్నారు. అనంతరం వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీతతో కలిసి బాలకృష్ణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రూ.22 కోట్ల వ్యయంతో చేపట్టిన మాతా-శిశు వైద్యశాలను ప్రారంభించిన సందర్భంగా పరిటాల సునీత మాట్లాడారు. బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటినుంచీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు.
మడకశిర..
మడకశిర ఉప కాలువ పనులు పూర్తయితే హిందూపురం - మడకశిర ప్రాంతాల్లో తాగు, సాగునీటికి కరువుండదు. ఇటీవల జిల్లాకు పలుమార్లు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవాపై సమీక్షలు చేసి, పనుల్లో వేగం పెంచే చర్యలు చేపట్టారు. గత ఏడాది డిసెంబర్ 2న ముఖ్యమంత్రి పెనుగొండ వద్ద గొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని విడుదల చేశారు. మడకశిర ఉపకాలువలో అంతర్భాగమైన గొల్లపల్లికి నీరు రావడంతో హిందూపురం-మడకశిర ప్రాంతాలకు కూడా అందుతుందని ప్రజల్లో ఆశలు చిగురించాయి. ఈ నెల 9న రాయదుర్గం మండలం 74 ఉడేగోళంలో ఏరువాక కార్యక్రమానికి వచ్చిన చంద్రబాబు జిల్లా ప్రజాప్రజానిధులు, అధికారులతో హంద్రీనీవా పనులపై సమీక్ష నిర్వహించారు.
పనుల్లో నిర్లక్ష్యం..
పనులు వేగవంతంగా సాగుతున్నా కాలువ నిర్మాణంలో రైల్వే, అటవీ, భూసమస్యలు పరిష్కరించాల్సి ఉంది. దీంతో అనుకున్న మేరకు ఆగ స్టు నెలాఖరుకు పనులు పూర్తయి, నీరు వస్తుందా అన్న సందేహాలు అందరినీ వెంటాడుతున్నాయి. చంద్రబాబు ఎన్ని సమీక్షలు చేస్తున్నా పనుల్లో నిర్లక్ష్యం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
చెరువులు నింపేందుకే..
పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మడకశిర ఉప కాలువ హిందూపురం మీదుగా మడకశిర, అగళి, అమరాపురం వరకు ఉంటుం ది. ఈ పనులను బ్రాంచ్ కాలువ 52 ప్యాకేజీ నుంచి 57 ప్యాకేజీల వరకు 17 ఎత్తిపోతల పంపులతో హిందూపురం, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లోని 264 చెరువులను నింపడమే లక్ష్యంగా చేపట్టారు.
బాలకృష్ణకు సూచన
హిందూపురంలో ఎన్ని పనులు చేపట్టాల్సి ఉంది. హిందూపురం మండలంలో కొడిపి వద్ద రైల్వే ట్రాక్ కింద, పెన్నా, జయమంగళి నదులపై అక్విడెక్ట్లు నిర్మించాల్సి ఉంది. విద్యుత్ సబ్స్టేషన్లు నిర్మించాల్సి ఉంది. హిందూపురంలో మూడు రోజుల పాటు పర్యటిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.. మడకశిర ఉప కాలువ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.