'భద్రాచలం తెలంగాణలోనే, మరో 34 నియోజకవర్గాలు'
జలంపై ఆధిపత్య కుట్ర: కోదండ
భద్రాచలం, మునగాల లేని తెలంగాణను ఊహించుకోలేమని, కృష్ణా, గోదావరి జలాలపై ఆధిపత్యం కోసమే సీమాంధ్రులు కుట్రలు చేస్తున్నారని ఐకాస చైర్మన్ ఆచార్య కోదండరాం ఆరోపించారు. సోమవారం ఆయన నల్లగొండలో ఐకాస విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్షకు సంఘీభావం ప్రకటించిన అనంతరం మాట్లాడారు. భద్రాచలం ప్రజలు, ఆ ప్రాంతం కాకతీయుల కాలం నుంచి తెలంగాణలో అంతర్భాగంగానే ఉందన్నారు. రాయల తెలంగాణ గురించి ప్రతిపాదనలు చేయటం సమంజసం కాదని, 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రోరోగ్ పైన జానా
మంత్రివర్గం ఆమోదంతోనే అసెంబ్లీ ప్రొరోగ్పై నిర్ణయం తీసుకోవాలని మంత్రి జానా రెడ్డి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఆయన మాట్లాడుతూ అసెంబ్లీని ఎప్పుడంటే అప్పుడు సమావేశపరచాలంటే ప్రొరోగ్ చేయకుండా ప్రస్తుత స్థితినే కొనసాగించడం సమంజసమన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా రెండు మాసాల్లోగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై తీరుతుందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన సోనియా, కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అండగా నిలవాలని కోరారు.
ప్రస్తుత ప్రత్యేక పరిస్థితుల్లో అసెంబ్లీని ప్రొరోగ్ చేయాల్సిన అవసరం లేదని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. సోమవారం కరీంనగర్లో ఓ బ్యాంకు ప్రారంభోత్సవం సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభవుతాయని ప్రశ్నించగా రాజ్యాంగ పరంగా చూస్తే డిసెంబర్ 20 లోగా అసెంబ్లీ సమావేశాలు జరుపాల్సి ఉందన్నారు. ప్రొరోగ్ చేయడమనడం సరైంది కాదన్నారు.