బుస కొడుతోన్న కుల వివక్ష: గుడిలోకి రావద్దని దళితులపై ఆంక్షలు..
కర్నూలు జిల్లా డోన్ మండల పరిధిలోని కన్నపుకుంటలో దళితులపై అగ్రవర్ణాల వివక్ష కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడు మద్దిలేటిస్వామి గుడి మెట్ల మీద కొబ్బరికాయ కొట్టాడన్న కారణంతో.. అగ్రవర్ణాలు ఆ
కర్నూలు: కర్నూలు జిల్లా డోన్ మండల పరిధిలోని కన్నపుకుంటలో దళితులపై అగ్రవర్ణాల వివక్ష కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఒక దళిత యువకుడు మద్దిలేటిస్వామి గుడి మెట్ల మీద కొబ్బరికాయ కొట్టాడన్న కారణంతో.. అగ్రవర్ణాలు ఆగ్రహించాయి.
ఆ యువకుడితో సహా దళితులంతా గ్రామంలోని అగ్రవర్ణాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. దళితులు దీనికి ఒప్పుకోకపోవడంతో అగ్రవర్ణాలు వీరిపై గుర్రుగా ఉన్నాయి. అదే సమయంలో దళితులు కూడా గ్రామంలో చావు కార్యక్రమాలకు వెళ్లడం మానేశారు. మొత్తంగా గ్రామమంతా నివురు గప్పిన నిప్పులా కనిపిస్తోంది.
కాగా, గ్రామంలో దళితుల పట్ల ఏళ్లుగా వివక్ష కొనసాగుతూనే ఉంది. మోహరం, దసరా పండుగల సందర్భంగా గ్రామంలోని ఆలయాల్లోకి దళితులను రానివ్వమని అగ్రవర్ణాల వారు బహాటంగానే చెబుతున్న పరిస్థితి.
అనాదిగా గ్రామంలో అమలవుతున్న అచారాలకు కట్టుబడి ఉండాల్సిందేనని అగ్ర వర్ణాల వారు వాదిస్తుండగా.. దేవుడిని మొక్కడం నేరమెలా అవుతుందని దళితులు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కావాలనే అగ్రవర్ణాలను తమ మీదకు ఉసిగొల్పుతున్నారని దళితులు వాపోతున్నారు.
గతంలో దళితులపై దాడి జరిగిన సంఘటనల్లో గ్రామంలో కొంతమందికి కోర్టు శిక్షలు పడ్డాయని వారు గుర్తుచేస్తున్నారు. ఇదిలా ఉంటే, తమను దేవాలయాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నందుకు దళితులు అగ్రవర్ణాల చావు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో అంతిమ సంస్కారాలకు అగ్రవర్ణాలలోని వాళ్లే గోతులు తవ్వుతున్నారు. ఐదు నెలల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.