చంద్రబాబు ఆగ్రహం-వెంకయ్య చక్రం, దిగొచ్చిన మోడీ: ప్యాకేజీ ఇలా!
విజయవాడ/న్యూఢిల్లీ: ఏపీకి ఏమిస్తారో వెంటనే తేల్చి చెప్పాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తిరుపతి సభ నేపథ్యంలో ఇటు టిడిపిలో, అటు కేంద్రంలో కదలిక వచ్చింది.
పవన్ కళ్యాణ్ సభ తర్వాత చంద్రబాబు కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు, హోదాను మించిన ప్యాకేజీ పైన చర్చోపచర్చలు జరిపిన కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీకి చంద్రబాబు ఓ సందేశం కూడా పంపించారని తెలుస్తోంది.
ప్యాకేజీ సరే కానీ: పత్తిపాటి, వారికీ జగన్ వెన్నుపోటు: మంత్రుల ఆగ్రహం
దీంతో, వారు ప్రధాని మోడీ విదేశీ పర్యటనను వారు ప్రస్తావించారని సమాచారం. ప్రధాని విదేశీ పర్యటనకు వెళుతున్నందున ఈ నెల 8న కాని, 9న కాని భారీ ప్యాకేజీని ప్రకటిస్తామని వారు చంద్రబాబుకు సమాచారం ఇచ్చారని తెలుస్తోంది.
అయితే పలుమార్లు వాయిదా వేయడంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారని, ఒకింత కటువుగానే మాట్లాడారని అంటున్నారు.
ఇప్పటికే ఆలస్యమైందని, అన్ని పార్టీల వారు బహిరంగ సభలు పెట్టాక.. ప్రకటన చేస్తే ఏం లాభమని ఘాటుగానే అన్నారని తెలుస్తోంది. బుధవారం లోగా ఏదో ఒకటి చేయాలని లేదంటే మీ ఇష్టమని కూడా అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో కేంద్రమంత్రి, తెలుగువాడైన వెంకయ్య నాయుడు కూడా హోదా కోసం జైట్లీ, మోడీల వద్ద గట్టిగానే మాట్లాడారు. ఇచ్చిన హామీ మేరకు ఏపీకి ఏమైనా ఇవ్వాలని వెంకయ్య మోడీ వద్ద చక్రం తిప్పారని తెలుస్తోంది. వెంకయ్య చక్రం, పవన్ సభ, బాబు డెడ్ లైన్ నేపథ్యంలో ఈ రోజు ప్రకటన రాబోతుందంటున్నారు. ఈ రోజు చేసే ప్యాకేజీ ప్రకటనకు మోడీ వద్ద ఆమోదం కూడా లభించిందంటున్నారు.
హోదా కానీ హోదా!
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ సిద్ధమైంది. మొదటి నుంచి కేంద్రం చెబుతున్నట్లుగా హోదా అని చెప్పకుండా.. ప్రత్యేక కేటగిరీ కింద హోదా ప్రయోజనాలు వచ్చేలా ప్యాకేజీ ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్యాకేజీపై గత పదిపదిహేను రోజులుగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇది కొలిక్కి వచ్చింది.
మధ్యాహ్నం ప్యాకేజీ ప్రకటన
కేంద్రమంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ఢిల్లీలో దీనిపై ఈ రోజు ప్రకటన చేసే అవకాశముంది. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు నార్త్ బ్లాక్లోని జైట్లీ కార్యాలయం వేదికగా ఈ ప్రకటన వెలువడనుంది. హోదా అని లేకున్నప్పటికీ దాదాపు అలాంటి ప్రయోజనాలన్నీ ఇవ్వనుంది.
హోదాలా 90 శాతం నిధులు
ప్రత్యేక హోదా వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు ఇచ్చే నిధుల్లో 90 శాతం (హోదాలేని రాష్ట్రాలకు 60 శాతమే) నిధులు గ్రాంటుగా లభిస్తాయి. హోదా లేనప్పటికీ ఏపీకి ఈ 90 శాతం నిధులు అందుతాయి. రాష్ట్రం 10 శాతం వాటా భరిస్తే చాలు. 90 శాతం నిధులు గ్రాంటుగా పరిగణించడంవల్ల ఏపీకి ఏటా రూ.2500 కోట్ల నుంచి మూడు వేల కోట్లు సమకూరే అవకాశముంది. అంతేకాకుండా విదేశీ నిధులతో అమలు చేసే ప్రాజెక్టులకు(ఈఏపీ) తీసుకునే రుణాల్లో కేంద్రం 90శాతం భరిస్తుంది. అయితే హోదా కింద కేంద్ర పథకాలు, ఈఏపీ రుణాల భారాన్ని వంద శాతం కేంద్రమే భరించాలని ఏపీ సీఎం చంద్రబాబు డిమాండ్ చేస్తున్నారు.
పోలవరానికి నిధులు
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం నిర్మాణ వ్యయంలో 90 శాతం నిధులను కేంద్రం భరిస్తుంది. ఈ విషయాన్ని ప్యాకేజీ ప్రకటనలో స్పష్టం చేయనున్నారని తెలుస్తోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం పోలవరంకు రూ.32వేల కోట్లు వ్యయమవుతుంది. అందులో 90 శాతం కేంద్రం భరిస్తుంది. తొలి విడతలో నాబార్డ్నుంచి రూ.18వేల కోట్లను రుణంగా ఇప్పించేందుకు కూడా కేంద్రం చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.
అమరావతికి భారీ సాయం
రాజధాని నిర్మాణానికి కేవలం రూ.2500కోట్లు మాత్రమే ఇస్తామని కేంద్రం చెప్పింది. ఆ నిధులు అండర్ గ్రౌండ్ కేబుళ్లు వేయడానికి కూడా సరిపోవని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతిని నిర్మించడానికి కేంద్రం భారీగా సాయం చేయాలని, నిర్మాణానికి 1.35 లక్షల కోట్లు వ్యయం అవుతుందన్నారు. ఇందులో తొలి విడతగా రూ.5వేల కోట్లు ఇవ్వాలని గతంలోనే విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం మనసు మార్చుకుంది. అమరావతికి భారీ సాయం చేయనుంది.
పక్క రాష్ట్రాల ఎఫెక్ట్.. పరిశ్రమలకు ప్రత్యేక నిధి
పరిశ్రమల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. పక్క రాష్ట్రానికి ప్రత్యేక రాయితీలు ఇస్తే తమ రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలి వెళ్లే ప్రమాదం ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అభ్యంతరం వ్యక్తం చేశారు. పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభ్యంతరాలు వెల్లడయ్యాయి. పారిశ్రామిక రాయితీల స్థానంలో ప్రత్యేక నిధులను ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
రాయితీ పన్ను
జీఎస్టీ రాబోతున్న నేపథ్యంలో పన్ను రాయితీలు ఇవ్వడం కుదరదు కాబట్టి దానికి బదులుగా రూ.500 కోట్లతో పన్ను రాయితీ నిధి ఏర్పాటు చేసి దానిద్వారా పరిశ్రమలకు రాయితీలు కల్పించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
విజయవాడకు రైల్వే జోన్
విశాఖకు రైల్వే జోన్, దుగరాజపట్నంలో ఓడరేవు... రెండూ సాధ్యం కాదని, వీటికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఇస్తే పరిశీలిస్తామని కేంద్రం స్పష్టం చెప్పిందని సమాచారం. విజయవాడలో రైల్వే జోన్కు కేంద్రం సుముఖత వ్యక్తం చేస్తోంది. దుగరాజపట్నం ఓడరేవు నిర్మాణం, నిర్వహణ సాధ్యం కావని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీనికి బదులుగా ప్రత్యామ్నాయ ప్రణాళిక పరిశీలించాలని కేంద్రం ఏపీకి చెప్పిందని సమాచారం.
వెనుకబడిన జిల్లాలు
ఏపీలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించి 7 జిల్లాలకు నిధులు ఇస్తుంది. 7 జిల్లాలకు ఏటా రూ.350కోట్ల చొప్పున ఆరేళ్లపాటు ఇస్తామని చెప్పింది. అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణంతోపాటు పలు ప్రాజెక్టులను కూడా జైట్లీ - వెంకయ్య ప్రకటనలో వెల్లడించనున్నారని తెలుస్తోంది.
రెవెన్యూ లోటు
రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం ఏపీకి ఏర్పడిన రెవెన్యూ లోటును దాదాపు రూ.7వేల కోట్లుగా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఈ పద్దు కింద రూ.3979 కోట్లు ఇచ్చారు. ఇకపై మరో రూ.3వేల కోట్లు చెల్లించే అవకాశముంది.