పవన్ కళ్యాణ్ అన్నదాంట్లో తప్పేంలేదు: చంద్రబాబు
అమరావతి: ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల అనంతపురం సభలో చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలో తనకు తప్పేమీ కన్పించడం లేదని అన్నారు.
మంగళవారం కేబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమిస్తామో చెప్పడానికే రెండేళ్లుపడితే... ఆ నిధులివ్వడానికి మరో రెండున్నరేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి ఉపయోగం ఏముందని చంద్రబాబు అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట అడిగాడని, అందులో తనకు తప్పేమీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు.
అవసరమైనప్పుడు రావాల్సిన నిధులు పుణ్యకాలం గడిచిపోయిన తరువాత వస్తే ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సకాలంలో రాష్ట్రానికి నిధులు అందితేనే సమస్యలు పరిష్కరించగలమని ఆయన తెలిపారు.
ప్యాకేజీకి చట్టబద్ధతే ముఖ్యం: ఎంపీలకు దిశానిర్దేశం
రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీకి చట్టబద్ధతే లక్ష్యంగా ఒత్తిడి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విజయవాడలోని తన కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడారు.
ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించేలా పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం వల్ల రాష్ట్రానికి జరిగే నష్టాన్ని భర్తీ చేసేలా ప్రత్యామ్నాయంగా ఇస్తామన్న ప్యాకేజీకికి చట్టబద్ధత దక్కినప్పుడే రాష్ట్రానికి మేలు జరుగుతుందని వివరించారు. బుధవారం ఎంపీలంతా కేంద్ర ప్రభుత్వ, బిజెపి ప్రతినిధులతో ఈ అంశాన్ని ప్రస్తావించాలని కోరారు.
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని కూడా అడగాలని సూచించారు. ఎంపీలు అందరూ సమష్టిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు రుణంపై వారం రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టత తీసుకురావాలని, పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విశాఖ రైల్వే జోన్కు సంబంధించి కూడా అధికారిక ప్రకటన చేసేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజనపై కూడా స్పష్టమైన ప్రకటన వచ్చేలా చూడాలని ఆదేశించారు. విదేశీ ప్రాయోజిత పథకాలకు కేంద్రం సాయంపై ఈ సమావేశాల్లో తమ వాణి వినిపించాలని కోరారు. తప్పుల తడకగా పునర్ వ్యవస్థీకరణ చేయడం వల్ల రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తాయన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఏ మేరకు సాయం చేయదలుచుకుందో తెలిస్తే ప్రజలకు భరోసా లభిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు .
ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేది
పెద్ద కరెన్సీ నోట్ల స్థానంలో కొత్త నోట్లను ప్రవేశపెట్టడం శుభ పరిణామమే అయినా, సామాన్యులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. నల్లధనం కట్టడికి ఎలక్ట్రానిక్ కరెన్సీని వినియోగించేలా కేంద్రం చర్యలు తీసుకునేలా ఎంపిలు కేంద్రంతో చర్చించాలని కోరారు.
నగదు చలామణిని తగ్గించి, నగదు రహిత లావాదేవీలు పెరగాల్సి ఉందన్నారు. డిజిటల్ ఇండియా సాకారం అయ్యేందుకు డిజిటల్ కరెన్సీ వినియోగం పెరగాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరి, ఎంపీలు ముత్తంశెట్టి శ్రీనివాస్, మాల్యాద్రి, కొనకళ్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.