నోట్ల రద్దు: బ్యాంక్ వద్ద ఫ్రీగా కూల్ డ్రింక్స్, తిరుపతిలో సంచార ఏటీఎం
నెల్లూరు: రూ.500, రూ.1000 నగదు మార్పిడి కోసం బ్యాంకుల వెంట గంటల కొద్ది పడిగాపులు కాసే శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కొందరికి చల్లటి వార్త. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల మార్పిడి, డబ్బుల కోసం ఏటీఎంల వద్ద, బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ కనిపిస్తోన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోకాకోలా కంపెనీ యాజమాన్యం అన్ని బ్యాంకుల వద్ద మూడు రోజుల పాటు ఉచితంగా కూల్ డ్రింకులు సరఫరా చేయనుంది. డబ్బు కోసం రోజంతా క్యూ లైన్లలో నిలబడి విసిగిపోతున్న వారికి చల్లని కూల్ డ్రింక్ అందించాలని నిర్ణయించారు.
వేదాయపాలెం సెంటర్లోని ఎస్బీఐ వద్ద కోకాకోలా ప్రతినిధులు కూల్ డ్రింక్ పంపిణీ చేసారు. ఎండలో అలసిపోయిన తమకు కూల్ డ్రింక్ ఇచ్చి ఉపశమనం కలిగేలా చేశారని పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఇలా చేపట్టినట్లు చెబుతున్నారు. ఎల్లుండి వరకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు.
తిరుపతిలో సంచార ఏటీఎం
పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఖాతాదారుల ఇబ్బందుల దృష్ట్యా ఏపీలో తొలి సంచార ఏటీఎంను చిత్తూరు జిల్లా తిరుపతిలో ప్రారంభించారు. ఎస్బీఐ డీజీఎం కులకర్ణి దీనిని ప్రారంభించారు. మొబైల్ వాహనంలో నగదు డిపాజిట్ చేసే యంత్రం, ఏటీఎం ఉండటంతో వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.