కూర్చుందాం: హరీష్కు దేవినేని కౌంటర్, ఏపీ-తెలంగాణలకు బోర్డ్ అక్షింతలు
విజయవాడ: తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శుక్రవారం నాడు కౌంటర్ ఇచ్చారు.
సాగు నీటి పైన హరీష్ రావు వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదని చెప్పారు. కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని వ్యాఖ్యానించారు. ఆగస్టు మూడో వారానికి కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామని దేవినేని చెప్పారు.
కృష్ణా జలాల సద్వినియోగానికి ఇరు తెలుగు రాష్ట్రాలు సహకరించుకోవాలని హరీష్ రావుకు దేవినేని హితవు పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు రాజకీయం చేయడం సరికాదన్నారు. రైతుల ప్రయోజనం కోసం రెండు రాష్ట్రాలు పని చేయాలన్నారు.
పెన్నా బ్యారేజీ పనులు వేగవంతం చేయండి
ఎస్పీఎస్ నెల్లూరు జిల్లాలో 150 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులను వేగిరం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ శుక్రవారం నాడు ఆదేశించారు. ఆయన పెన్నా బ్యారేజీ పనులను పరిశీలించారు.
అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు నిర్మాణానికి కావాల్సిన నిధులను విడుదల చేయిస్తానని చెప్పారు. ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది అక్టోబరు నెలలోగా పూర్తి చేయాలన్నారు.
పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా వచ్చే నీటిని రాయలసీమకు అందించేందుకు వీలుగా దానికి అనుబంధంగా ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. అనంతరం నారాయణ ద్విచక్ర వాహం పైన కావలి కాల్వ పైకి వెళ్లి పనులను పర్యవేక్షించారు.
తెలుగు రాష్ట్రాలకు కృష్ణా రివర్ బోర్డు అక్షింతలు
నీటి వాటాలపై నిత్యం తగవులాడుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు కృష్ణా జలాల యాజమాన్య బోర్డు తలంటింది. వినియోగించుకున్న నీటి వాటాలపై లెక్కలు సమర్పించడంలో తాత్సారం చేస్తున్న విషయమై ఆగ్రహం వ్యక్తం చేసింది.
2014-15 జల సంవత్సరానికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా వాడుకున్న నీటికి సంబంధించిన వివరాలను సమర్పించాలని బోర్డు రెండు రాష్ట్రాలను కొద్ది రోజుల క్రితం కోరింది. అయితే పూర్తి స్థాయి వివరాలను ఇచ్చేందుకు అటు ఏపీతో పాటు ఇటు తెలంగాణ కూడా ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది.
దీంతో బోర్డు తాజాగా రెండు రాష్ట్రాలకు శ్రీముఖాలు జారీ చేసింది. తక్షణమే ప్రాజెక్టులవారీగా వాడుకున్న నీటి వాటాలపై పూర్తి వివరాలు వెల్లడి చేయాల్సిందేనని ఆదేశాలు ఇచ్చింది. కృష్ణా డెల్టా, సాగర్ కుడి కాల్వ, పోతిరెడ్డిపాడు లెక్కలను ఏపీ దాస్తోంటే, కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఊకచెట్టువాగు, ఏఆర్ఎంపీ, సాగర్ ఎడమ కాల్వలకు సంబంధించిన వివరాలను తెలంగాణ ఇవ్వడం లేదని తెలుస్తోంది.