వ్యూహాత్మకమేనా : కాపు అంశంలో పవన్ను జగన్ ఫిక్స్ చేశారా...?
Recommended Video
గత కొద్ది రోజులుగా ఏపీని కుదిపేస్తోన్న అంశం కాపు రిజర్వేషన్ అంశం. కొంతకాలంగా చాలా సైలెంట్గా ఉన్న కాపు రిజర్వేషన్ అంశం జగన్ ప్రకటనతో ఒక్కసారిగా మళ్లీ రగులుకుంది. జగన్ కాపు రిజర్వేషన్ అంశం రాష్ట్రపరిధిలో లేదని రిజర్వేషన్లపై సుప్రీం కోర్టు తీర్పు అమలులో ఉన్నందున తానేమీ చేయలేనని ఒక్కింత స్పష్టంగానే చెప్పినప్పటికీ... రాజకీయంగా మాత్రం ఆ వ్యాఖ్యలు పెద్ద ప్రకంపనలే సృష్టించాయి.
జగన్ జగ్గంపెట బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో కొందరు కాపు రిజర్వేషన్లపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తుండటంతో ఈ స్టేట్ మెంట్ స్పష్టంగా చేయాల్సి వచ్చిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇందులో దాచేందుకు ఏమీ లేదని... సుప్రీం తీర్పును కాదని తానేమి చేయలేనని చెప్పినంత మాత్రానా ... కాపులకు జగన్ వ్యతిరేకం కాదని నేతలు చెబుతున్నారు. కాపు రిజర్వేషన్ల అంశాన్ని ప్రతి సందర్భంలోనూ గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది వైసీపీనేనని కన్నబాబు లాంటి నేతలు వివరణ ఇచ్చారు.
పవన్ను వ్యూహాత్మకంగా జగన్ ఫిక్స్ చేశారా..?
ఇక కాపు రిజర్వేషన్ల గురించి జగన్ ప్రస్తావించి స్వయంకృతాపరాధానికి పాల్పడ్డాడా అనే మాట కూడా కొందరి వైసీపీ నేతల్లో వినిపిస్తోంది. అయితే కాపులు పూర్తి స్థాయిలో వైసీపీకి లేరని జగన్ భావించారు కనుకే తను ఇంత స్పష్టంగా కాపు రిజర్వేషన్ల గురించి చెప్పారా అన్న అనుమానాన్ని రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో వెర్షన్ కూడా రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. టీడీపీ కాపు రిజర్వేషన్లపై తీర్మానం చేసి బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టేశారు. ఇక వారిని ఇరుకున పెట్టేందుకు పవన్పై జగన్ ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఈ వ్యాఖ్యలు చేశారా... అనేది కూడా చర్చ జరుగుతోంది.
కాపు రిజర్వేషన్లపై పవన్ ప్రకటన చేసే సాహసం చేస్తారా..?
పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్లపై ఇప్పటికిప్పుడు కాకపోయినా కొద్ది రోజుల తర్వాతైనా ఓ ప్రకటన చేయక తప్పదు. అయితే పవన్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనని చెబుతారా... కాపు రిజర్వేషన్లపై జగన్ చేసిన ప్రకటన తర్వాత వచ్చిన రియాక్షన్స్ చూసి కూడా పవన్ కళ్యాణ్ ప్రకటన చేసేందుకు సాహసిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం కాపులకు కనపడుతున్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. అయితే పవన్ కళ్యాణ్ కాపులకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి బీసీలను దూరం చేసుకునే సాహసం చేస్తారా.. లేక చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారా... అనేది హాట్ టాపిక్గా మారింది.
మభ్యపెట్టడం మా విధానం కాదు: బొత్స
ఇదిలా ఉంటే 2014 ఎన్నికల్లో టీడీపీ కాపు రిజర్వేషన్ అంశం తమ మేనిఫెస్టోలో ఉంచిందని అందుకే కాపులు టీడీపీకి ఓట్లు వేశారని ఆ తర్వాత టీడీపీ బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి పబ్బం గడుపుకుంటోందని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. కాపు రిజర్వేషన్లపై తమ విధానం చెప్పామని... చేయలేనివి చెప్పి ప్రజలను మభ్యపెట్టడం వైసీపీ విధానం కాదని బొత్స చెప్పారు. కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు కొంత బాధపడినప్పటికీ.. పార్టీ అధినేతపై కానీ వైసీపీపై కానీ వ్యతిరేకత లేదని బొత్స వివరించారు.
మొత్తానికి రాజకీయాల్లో నాయకులు పూర్తిగా నిజాలు మాట్లాడటం వల్ల కలిగే నష్టాలు... అలా అని పూర్తి అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టడాలు అంతగా వర్కౌట్ కావని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.