అనితకు క్షమాపణ చెప్పినా చాలన్న విష్ణుకుమార్: దిగిరాని రోజా
హైదరాబాద్: మండలి బుద్ధప్రసాద్ కమిటీ సిఫార్సులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో శాసనసభ్యురాలు రోజాపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు శ్రవణ్ కుమార్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. రోజా తన తప్పు అంగీకరిస్తుందేమోనని చూశామని, టిడిపి ఎమ్మెల్యే అనితకు క్షమాపణ చెప్పినా చాలునని అడిగామని ఆయన శుక్రవారం మీడియాతో అన్నారు.
అయితే రోజా అందుకు సిద్ధపడలేదని ఆయన చెప్పారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వ్యవహరించిన తీరు దొంగే దొంగ అన్నట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో రోజా దళిత ఎమ్మెల్యే అనితపై వ్యక్తిగత విమర్శలు చేశారని, సీఎంపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన చెప్పారు.
సభలో రోజా వాడిన భాష చాలా ఘోరంగా ఉందని, ఆమె క్షమించటానికి వీలులేని తప్పు చేశారని, రోజా తన ఒప్పుకుంటుందేమోనని కమిటీ ఎదురుచూసిందని ఆయన అన్నారు. కమిటీ సభ్యుడు విష్ణుకుమార్రాజు ఆమెతో మాట్లాడారని ఆయన చెప్పారు. అనితకు క్షమాపణ చెప్పినా చాలనని, సస్పెన్షన తొలగించాలని కోరుతామని విష్ణు కుమార్ రోజాకు చెప్పారని ఆయన అన్నారు.
కానీ ఆమె ఎలాంటి పశ్చాత్తాపం ప్రకటించలేదని, దీంతో రోజా తప్పు చేసిందని కమిటీ నిర్ధారణకు వచ్చిందని శ్రావణ్కుమార్ వెల్లడించారు. రోజాతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ప్రవర్తన సభలో సరిగాలేదని కమిటీ నిర్ధారించిందని, వీరందరిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కమిటీ తన నివేదికలో పేర్కొందని శ్రావణ్ వెల్లడించారు.
కమిటీ నివేదికను త్వరలో స్పీకర్కు అందజేస్తామని తెలిపారు. ఈ నివేదికను స్పీకర్ ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేస్తారని చెప్పారు. ఆ రెండు కమిటీలు తమ అభిప్రాయాలతో కూడిన తుది నివేదికను అసెంబ్లీ స్పీకర్కు సమర్పించిన తర్వాత స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు. వీటితోపాటు సభకు సంబంధించిన ఆడియో, వీడియో విజువల్స్ సోషల్ మీడియాకు ఎలా వెళ్లాయన్న దానిపైన కూడా కమిటీ విచారించిందని తెలిపారు.
తొలుత ఏ సామాజిక మాధ్యమంలో వీడియోలు వచ్చాయో చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డిని అడిగితే.. ‘ఆ విషయం మాకు తెలియదు. మీరే విచారించుకోండి' అని సమాధానమిచ్చారని శ్రావణ్ తెలిపారు.