వామ్మో..! ఎన్నికల్లో ఇన్ని జిమ్మిక్కులా..! ఒకే పేరుతో ఇంత మంది నామినేషన్లా..? దేవుడా..!!
అమరావతి/హైదరాబాద్: ఏపి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో జిమ్మిక్కులు, మరెన్నో విన్యాసాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా నామినేషన్ల ప్రక్రియలొ అభ్యర్థి పేరును పోలిన పేరుతో మరికొంత మంది అభ్యర్థులు నామినేషన్లు వేసి ఔరా అనిపిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీ నేతను బలహీన పరిచేందుకు ఇలాంటి జిమ్మిక్కులు సర్వసాధారణమైనప్పటికి, ఇంటి పేరుతో సహా అభ్యర్థులను వెతికి పట్టుకు వచ్చి నామినేషన్లు వేయించడం మామూలు విషయం కాదు. ఏపి ఎన్నికల్లో ఇలాంటి చిత్రాలు సగటు ఓటరును వామ్మో అనేలా చేస్తున్నాయి.
ఒకే పేరుతో ఎన్నో నామినేషన్టు..! ఏపి ఎన్నికల్లో ఎన్నో విన్యాసాలు..!!
పేరులో ఏముందిలే అని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎన్నికల వేళ, కొన్ని పేర్లకు డిమాండ్ ఏర్పడుతుంది. నందిగామ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పేరు తంగిరాల సౌమ్య. నామినేషన్ల చివరి రోజైన సోమవారం.. ఒకామెతో వైసీపీ నాయకులు నామినేషన్ వేయించారు. ఆమె పేరేమిటో తెలుసా...! ‘తంగిరాల సౌమ్య'...!! అంటే, పేరు ద్వారా కూడా ఓటర్లను తికమక చేసే ప్రయత్నమన్నమాట. ‘తంగిరాల శైలజ' పేరున్న మరొకామెతో కూడా వైసీపీ నాయకులు నామినేషన్ వేయించారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి పేరు మొండితోక జగన్మోహనరావు. ఎం.జగన్మోహనరావు అనే వ్యక్తితో టీడీపీ నాయకులు నామినేషన్ వేయించారు.
ఏపి లో ప్రతి జిల్లాలో డమ్మీ నామినేషన్లు..! అభ్యర్థి ఆదిక్యం తగ్గించేందుకే అంటున్న నేతలు..!!
ప్రకాశం జిల్లా పర్చూరులో కూడా నాయకులు ఇలాంటి ‘కళ'నే ప్రదర్శించారు. పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. ఒంగోలు సమీపంలోని పెళ్లూరుకు చెందిన దగ్గుబాటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి, ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా ఇదే పర్చూరు అసెంబ్లీకి నామినేషన్ వేశారు. అంటే, పేర్లు ఒక్కటే..! గుర్తు (ఫ్యాన్, హెలికాప్టర్) కూడా ఒక్కటే...!! పర్చూరు నియోజకవర్గంలో ప్రజాశాంతి అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడతాయో, ఎన్నికలయ్యాక చూసుకోండి. సందేహం లేదు... గణనీయంగానే పడతాయి. ఇలా 39 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ సెగ్మెంట్లలో వైసీపీ అభ్యర్థుల పేర్లను/గుర్తును పోలిన అభ్యర్థులు ఇండిపెండెంట్గా నిలబడ్డారట. ఉద్దేశ్యపూర్వకంగా, తమ పార్టీ ఓట్లను చీల్చేందుకే ప్రత్యర్థులు ఇలా ప్లాన్ చేశారంటూ ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు చేసింది. కింది జాబితా చూడండి.
వామ్మో ఇన్ని పేర్లా..? ఎక్కడ వెతుక్కొచ్చి నామినేషన్ వేయించారో..!!
1. పెనమలూరు: కొలుసు పార్థసారధి (వైసీపీ) - వేమూరి పార్థసారధి (ప్రజాశాంతి పార్టీ). 2. మైలవరం: వసంత వెంకట క్రిష్ణప్రసాద్ (వైసీపీ) - వెంకట క్రిష్ణారావు బోగోలు (ప్రజాశాంతి పార్టీ). 3. పెదకూరపాడు: శంకర్రావు నంబూరు (వైసీపీ) - నంబూరి శంకర్రావు (ప్రజాశాంతి పార్టీ). 4. చీరాల: ఆమంచి క్రిష్ణమోహన్ (వైసీపీ) - కర్ణా క్రిష్ణమోహన్ రావు (ప్రజాశాంతి పార్టీ). 5. ఒంగోలు: బాలినేని శ్రీనివాసరెడ్డి (వైసీపీ) - బాలినేని శ్రీనివాసరావు (ప్రజాశాంతి పార్టీ). 6. మార్కాపురం: కుందూరు నాగార్జున రెడ్డి (వైసీపీ) - నాగార్జున రెడ్డి (ప్రజాశాంతి పార్టీ). 7. కావలి: రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (వైసీపీ) - ప్రతాప్ రెడ్డి (ప్రజాశాంతి పార్టీ).
పేరులో ఏముందిలే అనుకోవద్దు..! ఎప్పుడో ఇలా ఉపయోగపడుతుందిలే..!!
8. రాయదుర్గం: కాపు రామచంద్రారెడ్డి (వైసీపీ) - ఉండాల రామచంద్రారెడ్డి (ప్రజాశాంతి పార్టీ). 9. అనంతపురం అర్బన్: అనంత వెంకటరామిరెడ్డి (వైసీపీ) - పగిడి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి పార్టీ). 10. ఉరవకొండ: విశ్వేశ్వర్ రెడ్డి (వైసీపీ) - విశ్వనాధ్ రెడ్డి (ప్రజాశాంతి పార్టీ). 11. కల్యాణదుర్గం: ఉషా శ్రీచరణ్ (వైసీపీ) - ఉషారాణి (ప్రజాశాంతి పార్టీ). 12. రాప్తాడు: తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి (వైసీపీ) - డీడీ ప్రతాప్ (ప్రజాశాంతి పార్టీ). 13. పెనుగొండ: ఎం.శంకర్నారాయణ (వైసీపీ) - ఎస్.శంకర్ నారాయణ (ప్రజాశాంతి పార్టీ). 14. ధర్మవరం: కేతిరెడ్డి (వైసీపీ) - పెద్దరెడ్డిగారి వెంకటరామిరెడ్డి (ప్రజాశాంతి పార్టీ). ఇలా, ఇండిపెండెంట్/ప్రజాశాంతి అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వారికి. వేయించిన ఆయా పార్టీల పెద్దలు ఎంత మొత్తంలో ముట్టజెప్పి ఉంటారో అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇకనైనా పేరులో ఏముందిలే అని తేలిగ్గా తీసిపారేయవద్దనే ఖటోర సత్యం మాత్రం యావత్ జనానికి తెలిసొస్తోంది సుమీ..!!