విలీనం కాదని ఎవరన్నారు: టిఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద్
తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని అరవింద్ రెడ్డి చెప్పారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ విలీనంపై స్పందిస్తూ... కాంగ్రెస్లో టిఆర్ఎస్ విలీనం కాదని ఎవరు చెప్పారని ప్రశ్నించారు. టిఆర్ఎస్.. కాంగ్రెస్ పార్టీలో విలీనమైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడే అవకాశం ఉందని అన్నారు. తెరాస విలీనమైనా కాకున్నా తాను కాంగ్రెసు పార్టీలో చేరుతానని చెప్పారు. కెసిఆర్ ఇచ్చిన మాట ప్రకారం పార్లమెంటులో బిల్లు పెట్టగానే తెరాసను విలీనం చేయాలన్నారు.
గతంలో తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతో స్నేహంగా ఉంటున్న అరవింద్ రెడ్డి, మూడు రోజులపాటు ఢిల్లీలో ఉండి కాంగ్రెస్ పెద్దలతో చర్చించినట్లు తెలిసింది. కాగా గురువారం ఆయన హైదరాబాద్కు వచ్చారు.
ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ తెలంగాణను ఇస్తుండటంతో ఆయన ఆ పార్టీలో చేరాలని భావిస్తున్నట్లు సమాచారం. టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్తో ఆయనకు సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన తర్వాత ఆయన కాంగ్రెసు పార్టీలో చేరే అవకాశముందని వారంటున్నారు. కాగా తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో శాసనసభకు రాకపోవడంపై అరవింద్ రెడ్డిపై టిఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.