2019లో ప్రధానిని డిసైడ్ చేసేది నేనే: జాతీయ రాజకీయాలపై చంద్రబాబు సంచలనం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చే సార్వత్రిక ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి.
Recommended Video
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ... రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో సాగాలని ఆకాంక్షించారు.
2019లో ప్రధానిని డిసైడ్ చేస్తా
ఇంకా ‘ తెలంగాణ, ఏపీలో మనపై గురుతర బాధ్యత ఉంది. తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించి రుణం తీర్చుకుంటా. 2019లో ప్రధానిని నిర్ణయించబోయేది చంద్రబాబే. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నాం' అని సీఎం చంద్రబాబు స్ఫష్టం చేశారు.
పవన్! మేం పిచ్చోళ్లమా? జీ హుజూర్ అనాలా? బాబు, లోకేష్ అవినీతిపరులా?: శివాజీ ఆగ్రహం
మాకెందుకు ఇవ్వరు?
‘ప్రత్యేక హోదా సహా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని కేంద్రాన్ని అడుగుతున్నా. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు కావాలని అడిగింది మీరే. ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరని అడుగుతున్నా. 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చి అన్ని ప్రయోజనాలు కల్పించారు. ఆ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడు మాకెందుకు ఇవ్వరో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ప్రత్యేక హోదా అడిగితే స్పెషల్ పర్పస్ వెహికల్ అంటున్నారు. రాష్ట్ర హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడబోం' అని చంద్రబాబు తేల్చి చెప్పారు.
లోపల అలా.. బయటి ఇలా.. జగన్ పార్టీ తీరిది
‘అమరావతి సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీని అమలు చేయాలి. రాష్ట్రానికి సాయం చేయాలన్న కనీస ఆలోచన కూడా కేంద్రానికి లేదు. రాజధాని కోసం ఇచ్చిన పిలుపు మేరకు రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. 2022 నాటికి మూడు అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేంద్రం పట్ల లోపల విశ్వాసం.. బయట అవిశ్వాసం అనేలా వ్యవహరిస్తున్నారు. ఇంకొకరు నాలుగేళ్లు మనతో బాగుండి.. అకస్మాత్తుగా తిరగబడుతున్నారు. రాష్ట్ర ప్రజలకు 37 ఏళ్లుగా తెలుగుదేశం సేవలు అందిస్తోంది ' అని బాబు తెలిపారు. నిన్న మొన్నటి వరకు టీడీపీలో ఉన్న వ్యక్తి కూడా విమర్శలు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి బాబు వ్యాఖ్యానించారు.
కొండలైనా బద్దలు చేస్తాం
‘రాష్ట్ర ప్రజలంతా మద్దతు ఇస్తే కొండనైనా బద్దలు చేయగల శక్తి టీడీపీకి ఉంది. రాష్ట్ర ప్రజలంతా టీడీపీకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. కార్యకర్తలు ఎక్కడికక్కడ ప్రజలతో మమేకం కావాలి. ప్రభుత్వం చేస్తున్న మెరుగైన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పాలి' అని చంద్రబాబు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. జన్మభూమి కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజల సహకారంతో శక్తివంతమైన రాష్ట్రంగా తయారు చేస్తా. పట్టిసీమ రాకపోతే కృష్ణాడెల్టా ఎండిపోయి ఉండేది. వంద రోజుల్లో విద్యుత్ కష్టాలు తీర్చగలిగాం. భవిష్యత్లో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పిన ప్రభుత్వం మాది' అని చంద్రబాబు స్పష్టం చేశారు.