మల్కాజిగిరి: పవన్కళ్యాణ్, మోడీలతో జెపి రాజకీయం?
హైదరాబాద్: లోక్సత్తా పార్టీ అధ్యక్షులు, మల్కాజిగిరి లోకసభ బరిలో నిలిచిన జయప్రకాశ్ నారాయణ రాజకీయాలు చేస్తున్నారా? అంటే పలువురు ఆ పార్టీ క్యాడర్ కొట్టి పారేస్తోంది. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్తో జెపి రాజకీయాలు చేస్తున్నారని ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తనకు జెపి అంటే ఇష్టమని, తాను జెపి తరఫున మల్కాజిగిరిలో ప్రచారం చేస్తానని పవన్ గతంలో ప్రకటించి.. ఆ తర్వాత కొద్ది రోజుల క్రితం తగ్గిన విషయం తెలిసిందే.
తనకు జెపి అంటే గౌరవం ఉందని అయితే, పొత్తు ధర్మంలో భాగంగా తాను టిడిపి అభ్యర్థి మల్లారెడ్డికి మద్దతిస్తున్నానని పవన్ ఇటీవల చెప్పారు. మొదటి నుండి ఆయన జెపికి మద్దతుగా ప్రచారం చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. హఠాత్తుగా పవన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఇదే విషయాన్ని జెపి చెప్పే ప్రయత్నాలు చేశారు. దీంతో పవన్ పేరుతో జెపి రాజకీయాలు చేస్తున్నారని విమర్శలు వినిపించాయి.

అయితే, జెపి వంటి వ్యక్తి లోకసభలో ఉంటే బాగుంటుందని ఆ పార్టీ అభిప్రాయపడుతుంది. టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపి నాయకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తాము జెపికి మద్దతిస్తున్నామని.. జెపి వంటి నేతలు లోకసభలో అవసరమని అంటున్నారు. వెంకయ్య నాయుడు వంటి సీనియర్ బిజెపి నేత అదే చెబుతున్నారు.
జెపి తన ప్రచారంలో దేశానికి మోడీ వంటి నాయకుడు కావాలని, మల్కాజిగిరి నుండి తన వంటి నాయకుడిని గెలిపించాలని చెప్పారు. పత్రికా ప్రకటనలు మొదలు... ఆయన మోడీ పేరునే తలుస్తున్నారు. అదే సమయంలో పవన్ వ్యాఖ్యలు కూడా ఆయన కలిసి వచ్చేలా కనిపిస్తోంది. పవన్ తనకు అనుకూలంగా ప్రచారం చేస్తానని చెప్పి ఆ తర్వాత ఒత్తిడితో తగ్గారనే విషయాన్ని జెపి ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేశారని అంటున్నారు.
పొత్తు లేకపోయినప్పటికీ మోడీని, పవన్ కళ్యాణ్ను ఉపయోగించుకోవడం జెపి రాజకీయమేనని అంటున్నారు. నగర ప్రాంతం బిజెపి హవా ఉండటంతో దానిని ఆయన తన లబ్ధికి ఉపయోగించుకుంటున్నారని విపక్షాలు అంటున్నాయి. అయితే, స్వయంగా బిజెపి నేతలు, పవన్ వంటి వారే జెపి వంటి వారు లోకసభలో ఉండాలని చెప్పారని, అదే విషయాన్ని తాము చెబితే రాజకీయం ఎలా అవుతుందని జెపి అభిమాన గణం ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications