వైఎస్ జగన్..ఎన్నికల టీమ్ సిద్ధం: మరిన్ని బదిలీలు?: ఉగాది నాటికి అది కూడా పూర్తి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకున్న రెండే రెండు ఉన్నతాధికారుల బదిలీలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. వైఎస్ జగన్ ఆంతర్యం ఏమిటనేది డిబేట్లకు దారి తీసింది. అటు రాజకీయంగా ఈ బదిలీల వ్యవహారం దుమారం రేపుతోంది. విమర్శలను సంధించడానికి ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలకూ అవకాశాన్ని ఇచ్చినట్టయింది. వీటన్నింటికీ వైఎస్ఆర్సీపీ ఎదురుదాడికి దిగాల్సిన పరిస్థితిని కల్పించినట్టయింది.
ప్రవీణ్ ప్రకాష్తో ఆరంభం..
నిజానికి- ఏ ప్రభుత్వంలోనైనా ఐఎఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు సర్వ సాధారణమే. పరిపాలనకు అనుకూలంగా, వారి సామర్థ్యానికి అనుగుణంగా..పోస్టింగ్స్ ఇస్తుంటుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఈ రెండు బదిలీలు మాత్రం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. మొదట ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ బదిలీ వ్యవహారమే ఆశ్చర్యానికి గురి చేయగా.. ఆ మరుసటి రోజే- ఏకంగా పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌతమ్ సవాంగ్కు స్థానం చలనం కల్పించింది ప్రభుత్వం.
అర్ధాంతర బదిలీలు..
సాధారణంగా- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీస్ డైరెక్టర్ జనరల్ వంటి అత్యున్నత అధికారులు అదే హోదాలో పదవీ విరమణ చేస్తుంటారు. వైఎస్ జగన్.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం కూడా అర్ధాంతరంగా బదిలీ కావాల్సి వచ్చింది. పూర్తి కాలం ఆయన ఆ హోదాలో కొనసాగలేకపోయారు. తాజాగా గౌతమ్ సవాంగ్దీ అదే పరిస్థితి. డీజీపీ ర్యాంక్ అనేది పోలీస్ శాఖలో అత్యున్నతమైనది. ఆ హోదాలోనే చాలామంది అధికారులు పదవీ విరమణ చేశారు..చేస్తుంటారు. అర్ధాంతరంగా డీజీపీ హోదా నుంచి బదిలీ కావాల్సి వచ్చింది.
నీలంసాహ్నీ ఒక్కరే..
ప్రస్తుతం- వైసీపీ ప్రభుత్వ హయాంలో నీలం సాహ్నీ ఒక్కరే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. సర్వీస్కు మించి సేవలను అందించారు. పదవీ విరమణ చేసిన తరువాత కూడా ప్రభుత్వం నీలం సాహ్నీ సేవలను వినియోగిచుకుంటోంది. ఆమెను రాష్ట్ర ఎన్నికల సంఘం ఛైర్పర్సన్గా నియమించింది. డాక్టర్ సమీర్ శర్మ కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేయడానికే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన పదవీ కాలం పూర్తయినప్పటికీ- వైఎస్ జగన్ విజ్ఞప్తి మేరకు ఆయన సర్వీస్ను కేంద్రం పొడిగించింది.
ఎన్నికల టీమ్
గౌతమ్ సవాంగ్ స్థానంలో తన సొంత జిల్లా కడపకే చెందిన కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డిని వైఎస్ జగన్ డీజీపీగా నియమించడం వ్యూహాత్మకమేనని అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికల ప్రిపరేషన్లో వైఎస్ జగన్ ఉన్నారనే అంచనాలు వెలువడుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచి పాలనాపరంగా, అధికారపరంగా కీలక మార్పులు చేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నారని, ఇందులో భాగంగానే- ఈ బదిలీలు చోటు చేసుకున్నాయనే వారూ లేకపోలేదు.
కొత్త జిల్లాలు.. కొత్త మంత్రులు..
రాష్ట్రంలో ఉగాది నుంచి కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న విషయం తెలిసిందే. దీనికి అవసరమైన కసరత్తు అంతా పూర్తి చేసింది ప్రభుత్వం. మార్చి మూడో వారంలో తుది నోటిఫికేషన్ వెలువడుతుంది. ఆ తరువాత కొత్త జిల్లాల నుంచి పరిపాలన ఆరంభమౌతుంది. అదే సమయంలో కొత్త మంత్రివర్గాన్ని కూడా వైఎస్ జగన్ సిద్ధం చేసుకుంటారని అంటున్నారు. ఇప్పుడున్న మంత్రుల్లో ఇద్దరు లేదా ముగ్గురు సీనియర్లను కొనసాగిస్తూ-మిగిలిన వారందరినీ తొలగించి- కొత్తవారికి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. ఎన్నికల టీమ్ను సిద్ధం చేసుకుంటున్నారని, ఈ రెండున్నరేళ్ల కాలాన్ని రాజకీయంగా విలువైనదిగా ఆయన భావిస్తున్నారని అంటున్నారు.