ఏపీలో లాక్డౌన్పై నోటిఫికేషన్ జారీ.. కీలక అంశాలివే
కరోనా వైరస్ పై దేశం పోరాటం ప్రకటించింది. దేశంలో తీవ్రంగా కరోనా వైరస్ మారుతున్న నేపధ్యంలో దేశం షట్ డౌన్ అయ్యింది . ఇక కరోనా ప్రబలుతున్న దృష్ట్యా దానికి కంట్రోల్ చెయ్యటం కోసం ఏపీ సీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షట్ డౌన్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక దీనికి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. మార్చి 31 తేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ ఆదేశాలు ఇస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.
అత్యవసరం మినహాయించి అన్నీ బంద్
దేశం మొత్తం కరోనా విషయంలో అలెర్ట్ అవటం , అదే సమయంలో కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్ లో పలు జిల్లాలలో లాక్ డౌన్ ప్రకటించటం తో వైరస్ వ్యాప్తి నిరోధానికి మార్చి 31 తేదీ వరకూ ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ లో పేర్కొంది. ప్రజా రవాణా వ్యవస్థ తక్షణమే నిలిపి వేస్తూ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఇదే సమయంలో ఆటోలు, ట్యాక్సీలు సైతం నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రులకు, విమానాశ్రయలు, రైల్వే స్టేషన్లకు వచ్చి వెళ్లేందుకు పరిమితంగా మినహాయింపు ఇచ్చారు. అత్యవసరం మినహాయించి ఏమీ నడవటానికి , నడపటానికి లేదని పేర్కొన్నారు. అంతేకాదు అంతరాష్ట్ర రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేశారు.
కరోనా నిరోధక చర్యల్లో పాల్గొంటున్న సిబ్బందికి మినహాయింపు
ఇక ప్రజలకు లాక్ డౌన్ సమయంలో మందిరాలు, మసీదులు, చర్చిలు కూడా 31 తేదీ వరకూ దర్శనాలు నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. నిత్యావసరం కాని దుకాణాలు, మాల్స్, ఇతర వాణిజ్య సంస్థలు 31 తేదీ వరకూ మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. వాణిజ్య సంస్థలు, ఫ్యాక్టరీలు, గోదాములు తదితరాలు అవసరం అయితే కనిష్ట సిబ్బందితో పని చేయాలని సూచనలు చేశారు. ఇక కరోనా నిరోధక చర్యల్లో నిమగ్నమై విధులు నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్లు, జేసీలు మొదలైన అధికార గణం, వైద్య ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, విద్యుత్ శాఖ, మున్సిపల్ సిబ్బంది, బ్యాంకులు, ఏటీఎంలు, ఫార్మాసి దుకాణాలు, మీడియా సిబ్బందికి లాక్ డౌన్ నుంచి మినహాయింపు కల్పించింది ప్రభుత్వం.
జనసంచారంపై నిషేధాజ్ఞలు
అంతేకాదు జనసంచారంపై నిషేధాజ్ఞలు విధించారు . ప్రజలు గుంపులుగా ఉండకూడదని, సామాజిక దూరం పాటించాలని పేర్కొన్నారు.రాష్ట్రంలో ప్రతీ నియోజకవర్గంలోనూ కరోనా నిరోధక చర్యల్లో భాగంగా వంద పడకల ఐసోలేషన్ వార్డులు, క్వారైంటైన్ల ఏర్పాటు చేయాలని ఆదేశాల్లో పేర్కొంది సర్కార్. ప్రతీ జిల్లా కేంద్రంలోనూ 200-300 పడకల అత్యాధునిక చికిత్సా సౌకర్యాలతో వార్డులను ఏర్పాటు చేయనున్నారు. ఇక విదేశాల నుంచి వస్తున్న వ్యక్తులు తప్పని సరిగా 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు.
నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు
ఇక నిత్యావసర వస్తువులకు మినహాయింపు ఇచ్చింది. సరుకులు , కూరగాయలు, పెట్రోల్ బంకులు, గ్యాస్, మందులు లాంటి అత్యవసర సేవలు కొనసాగుతాయి.. నిత్యావసరాలు అధిక ధరలకు విక్రయించకుండా కూడా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచనలు చేసింది. అదే విధంగా ఉల్లంఘించిన వారిపై కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సర్కార్ వ్యవసాయ పనులపై ఉన్న రైతులు, రైతు కూలీలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
సామాజిక దూరం పాటిస్తూ పనులు నిర్వహించుకునే వెసులుబాటు కల్పిస్తూ ఆదేశాలిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో అత్యవసర విధులు నిర్వహించే వారుమాత్రమే హాజరు కావాలని సూచించింది. తప్పనిసరిగా ఉత్పత్తి కొనసాగించాల్సిన ఫ్యాక్టరీలు ముందస్తు అనుమతితో కొనసాగించాలని ఆదేశాలిచ్చింది. లాక్ డౌన్ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై ఐపీసీ 188 ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్లకు, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. నిబంధనలు పాటించి కరోనా నివారణకు సహకారం అందించాలని , నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది .