ఓబులేష్ ఇలా దాడి చేసి, అలా పారిపోయాడు: సిపి
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని కెబిఆర్ పార్కు వద్ద అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ నిత్యానంద రెడ్డిపై కాల్పులు జరిపిన గ్రే హౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేష్ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఎకె 47 రైఫిల్ను, బుల్లెట్లను కూడా మీడియా ముందు ప్రదర్శించారు. నిత్యానంద రెడ్డిపై ఓబులేష్ ఎందుకు దాడి చేశాడు, ఎలా దాడి చేశాడు, ఎలా పారిపోయాడనే విషయాలను కూడా ఆయన వివరించారు. కర్నూలు జిల్లాలో అతన్ని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
నిత్యానంద రెడ్డిని కిడ్నాప్ చేసి, డబ్బులు లాగేందుకే ఓబులేష్ ప్రయత్నించినట్లు తమ విచారణలో తేలిందని ఆయన చెప్పారు. ఘటన జరిగిన 24 గంటల్లో తాము నిందితుడిని గుర్తించి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. నిత్యానంద రెడ్డిపై దాడికి ఉపయోగించిన ఎకె 47 రైఫిల్ను 2013 డిసెంబర్లో గ్రేహౌండ్స్ నుంచి దొగిలించినట్లు తెలిపారు. జాకెట్ వేసుకుని వచ్చి సెలవులో ఉండి కూడా శుభ్రం చేస్తాననే పేరు మీద వచ్చి దాన్ని దొంగిలించాడని ఆయన చెప్పారు. దాన్ని ఓర్వకల్లు వద్ద రాళ్లలో దాచిపెట్టినట్లు తెలిపారు.
కాల్పులకు ముందు రోజు ఓబులేష్ రెక్కీ నిర్వహించినట్లు మహేందర్ రెడ్డి చెప్పారు. అతని మానసిక పరిస్థితి బాగానే ఉందని, గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు బాగానే ఉండేవాడని, సంపన్నులను భయపెట్టి డబ్బులు గుంజడానికే ఆయుధాన్ని దొంగిలించినట్లు ఓబులేష్ చెప్పాడని ఆయన అన్నారు. వ్యసనాలకు అలవాటు పడి నేరాలకు మరిగి ఉంటాడని ఆయన అన్నారు. వారం క్రితం ఓర్వకల్లు నుంచి ఓబులేష్ ఎకె 47ను హైదరాబాద్ తీసుకుని వచ్చినట్లు ఆయన తెలిపారు. ఓబులేష్ 2001లో గ్రేహౌండ్స్లో చేరి 12 ఏళ్ల పాటు పనిచేశాడని, ఎపిఎస్పీ 11వ బెటాలియన్లో కూడా పనిచేశాడని ఆయన చెప్పారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి మహబూబ్నగర్ జిల్లా కొత్తూరు వరకు కారులో తీసుకుని వెళ్లి పది లక్షలు తీసుకుని కారును, కారు యజమానిని వదిలేశాడని ఆయన చెప్పారు. మరిన్ని విషయాలు ఏమైనా ఉంటే విచారణలో తేలుతాయని ఆయన చెప్పారు. ఆ సొమ్ము ఓబులేష్ ఖాతాలో జమ అయినట్లు కూడా తెలుస్తోందని ఆయన చెప్పారు. కొంత సొమ్ముతో వాహనం కొనుక్కున్నానని చెప్పాడని ఆయన అన్నారు.
నేరాలకు అతను ఒక్కడే పాల్పడుతున్నట్లు తెలుస్తోందని ఆయన అన్నారు. గ్రౌహౌండ్స్లో పనిచేశాడు కాబట్టి ఎలా స్థావరాలను ఏర్పాటు చేసుకోవాలి, ఎలా దాక్కోవాలనే విషయాలు ఓబులేష్కు తెలుసునని, అందుకే దొంగిలించిన ఎకె 47ను మరెక్కడో పెట్టలేదని, తన ఒక్కడికి మాత్రమే తెలిసేలా చూశాడని, ఓర్వకల్లు నుంచి ఆయుధం తెచ్చి నార్సింగిలోని తన ఇంట్లోనే పెట్టుకున్నాడని ఆయన చెప్పారు. నిత్యానంద రెడ్డిపై దాడి చేసిన రోజు ఓబులేష్ సెలవులో ఉన్నాడని, సిసిటివి ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించామని ఆయన చెప్పారు.
మహేందర్ రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం - ఓబులేష్ అమీర్పేట వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి ఆటోలో కృష్ణా నగర్ వచ్చాడు. అక్కడి నుంచి కెబిఆర్ పార్కుకు నడిచి వచ్చాడు. నిత్యానంద రెడ్డి కారు దిగి వాకింగ్ కోసం వెళ్తున్నప్పుడు గమనించాడు. కారును గుర్తు పెట్టుకుని నిత్యానంద రెడ్డి తిరిగి వచ్చి కారు ఎక్కి సీటు బెల్టు పెట్టుకుంటున్న సమయంలో లోనికి చొరబడ్డాడు. బ్యాగులో పెట్టుకున్న ఎకె 47 రైఫిల్ బ్యారెల్ మాత్రమే చూపించి నిత్యానంద రెడ్డిని బెదిరించాడు. ఆ సమయంలో నిత్యానంద రెడ్డి పెద్దగా కేకలు వేశారు.
ఆ కేకలు విన్న నిత్యానంద రెడ్డి సోదరుడు ప్రసాద రెడ్డి వెనక నుంచి వచ్చాడు. ఓబులేష్ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దాంతో పెనుగులాటలో జరిగింది. ఈ పెనుగులాటలో ఓబులేష్ బ్యాగ్, ఆయుధం జారిపోయాయి. దాంతో ఓబులేష్ హడావిడిగా సందులోంచి ఇందిరానగర్, అక్కడి నుంచి కృష్ణా నగర్ వచ్చి ఆటోలో అమీర్ పేటకు చేరుకున్నాడు. అమీర్పేటలో బస్సు ఎక్కి ఇమ్లీబన్ బస్ స్టేషన్ చేరుకున్నాడు. ఇమ్లిబన్లో బస్సెక్కి కర్నూలు జిల్లాకు చేరుకున్నాడు.
దాడి చేసిన రోజే నిందితుడిని గుర్తించామని, వివిధ ప్రాంతాలకు పోలీసు బృందాలను పంపించి గాలించామని మహేందర్ రెడ్డి చెప్పారు. నేర సంఘటనలకు ఓబులేష్ ఒంటరిగానే పాల్పడ్డాడని భావిస్తున్నమని, అందుకే బయటకు విషయం పొక్కకుండా చూసుకోగలిగాడని ఆయన చెప్పారు. అయితే, అతనితో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, లేరా అనే విషయం విచారణలో తేలుతుందని అన్నారు.