పవన్ తో కేసీఆర్ ఏం చెప్పారు, పొత్తు ప్రతిపాదన పైనే చర్చా : సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా..!
రాజ్భవన్ వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. పవన్ కళ్యాన్ తో తెలంగాన ముఖ్యమంత్రి కేసీఆర్..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. మధ్యలో పవన్ ను కూర్చో బెట్టి సుదీర్ఘంగా చర్చించారు. ఏపిలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ చర్చ పై ఆసక్తి కనిపిస్తోంది.
కేసీఆర్..కేటీఆర్ మధ్యలో పవన్..
రిపబ్లిక్ డే సందర్బంగా గవర్నర్ నరసింహన్ ఎట్ హోం కు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి సీయం చంద్రబాబు, వైసిపి అధినేత జగన్ గైర్హాజరయ్యారు. జనసేన అధినేత పవన్ కళ్యాన్ హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వైపు..టిఆర్యస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోవైపు కూర్చున్నారు. పవన్ కళ్యాన్ ను మధ్యలో కూర్చోబెట్టుకొని ఇద్దరూ సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. కేసీఆర్ పవన్ కు చాలాసేపు చెప్పే ప్రయత్నం చేసారు. ఆ సమయంలో పవన్ ఆసక్తిగా ఆలకించారు. ఏపీలో గత కొద్దిరోజులుగా జరిగిన రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాల పై కేసీఆర్ కొంత కాలంగా అనేక పార్టీల నేతలను కలిసారు. తాజాగా, ఇదే అంశం పై కేటీఆర్..వైసిపి అధినేత జగన్ తోనూ భేటీ అయ్యారు. దీంతో..ఇప్పుడు పవన్ తో సైతం ఇదే అంశం చర్చించారా లేక..చంద్రబాబు ఎన్నికల వ్యూహాల పై మాట్లాడారా అనే చర్చ జరుగుతోంది.
తాజాగా పవన్ వ్యాఖ్యలతో ప్రాధాన్యం..
కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుపై తొలిసారి ప్రకటన చేసినప్పుడు పవన్ కల్యాణ్ స్వాగతించారు. కానీ, ఆ తర్వాత ఎప్పుడూ దానిపై స్పందించలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా తెనాలి వెళ్లిన పవన్ అక్కడ జరిగిన సభలో టిఆర్యస్ను దెబ్బ తీసేందుకు నాడు వైయస్ ప్రయత్నించారని..అయితే జగన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఆ పార్టీ నేతలే జగన్ ను అడ్డుకొని ఇప్పుడు ఆ నేతలే జగన్ కు మద్దతిస్తున్నారని విమర్శించారు. అదే సమయంలో పొత్తు పై టిఆర్యస్ నేతలతో మాట్లాడిస్తున్నారంటూ పవన్ వ్యాఖ్యానించారు. దీంతో..టిఆర్యస్ నేతలు జగన్ - పవన్ ను కలిపేందుకు ప్రయత్నాలు చేసారా అనే అనుమానం మొదలైంది. ఇక, తెలంగాణ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పోటీ చేసిన చంద్రబాబుకు ఏపిలో రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. అందులో భాగంగా..రాజకీయ వ్యూహా లపైనా వీరి మధ్య చర్చకు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
పవన్ వ్యాఖ్యలను ఖండించని టిఆర్యస్..
తనతో పొత్తు కోసం టిఆర్యస్ నేతలతో మాట్లాడిస్తున్నారంటూ కొద్ది రోజుల క్రితం పవన్ చేసిన వ్యాఖ్యలను టిఆర్ యస్ నేతలు ఎక్కడా ఖండించలేదు. పవన్ వ్యాఖ్యల్లో నిజం లేదనే చెప్పే ప్రయత్నం చేయకపోవటం ద్వారా జనసేన అధినేత చెప్పిన విషయాలు వాస్తవమనే అభిప్రాయం కలుగుతోంది. అయితే, ఎలాగైనా ఏపి ఎన్నికల్లో చంద్రబాబు ను ఎలాగైనా ఓడించాలని లక్ష్యంతో ఉన్న కేసీఆర్ అటు ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తమతో కలుపుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఎన్నికల సమయం దగ్గర పడతున్న వేళ..కేసీఆర్ తాజా భేటీలో తిరిగి పొత్తు అంశాన్నే ప్రతిపాదించి ఉంటారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఏపిలో తాజా పరిణామాల నేపథ్యంలో భవిష్యత్ రాజకీయాల పైనా చర్చించినట్లు తెలుస్తోంది. మరి..పవన్ పై వీరి ప్రభావం ఉంటుందా.. ఏ రకంగా స్పందిస్తారో చూడాలి.