చెత్త కనిపించకూడదు: స్వచ్ఛ హైదరాబాద్పై కెసిఆర్
హైదరాబాద్: ఇటీవల ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం విజయవంతమైందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు వ్యాఖ్యానించారు. స్వచ్ఛ హైదరాబాద్పై కేసీఆర్ శుక్రవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లపై ఎక్కడా చెత్త కనిపించకూడదని అధికారులకు ఆదేశించారు. రోడ్లపై అడ్డంగా ఉన్న కరెంట్ తీగలను తొలగించాలని ఆయన సూచించారు. స్వచ్ఛ హైదరాబాద్ నిరంతర ప్రక్రియ అని ఆయన అన్నారు.
నగరంలో తాగునీరు తగిన సమయంలో రాకపోవడం, అర్ధరాత్రి సమయంలో నీళ్లు రావడం, నల్లాల్లో మురుగునీరు రావడం, పవర్లైన్స్ తొలగించే విధానం, నాలాలపై చర్యలు తీసుకునే విధానం, శానిటేషన్ తదితర సమస్యలను సరిచేస్తే తప్ప అనుకున్న లక్ష్యం నెరవేరదని, స్వచ్ఛ హైదరాబాద్ కల సంపూర్ణంగా జరగదని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవే కాకుండా కొన్ని ప్రాంతాలలో ఇంకా ప్రత్యేకమైన సమస్యలు ఉండవచ్చునని ఆయన అన్నారు. ఈ సమస్యలన్నిటిని దృష్టిలో పెట్టుకుని సరిచేస్తే బాగుంటుందని ఆయన అధికారులకు ఆదేశించారు.
హైదరాబాదులోని ఇళ్లలో తడి, పొడి చెత్తలను వేర్వేరుగా వేసేలా చైతన్యం కలిగించాలని ఆయన సూచిచారు. హైదరాబాదులో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువులను తయారు చేయాలని కూడా చెప్పారు. ఇంటి నుంచి చెత్తను ఆటోలకు, ఆటోల నుంచి లారీలకు, లారీల నుంచి నేరుగా డంపింగ్ యార్డుకు చేర్చాలని చెప్పారు. చెత్తను తరలించేందుకు ఆటో ట్రాలీలను సిద్ధం చేస్తున్నామని, ఈ ట్రాలీ ఆటోలను బస్తీల్లోని నిరుద్యోగులకు అప్పగిస్తామని చెప్పారు.
ఇళ్లు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాదు నగరంలో 72 నాలాలు ఉన్నాయని, నగరంలోని నాలాలను అక్రమించుకుని ఇళ్ల నిర్మాణం జరిగిందని, దీంతో నీరు రోడ్లపై పారుతోందని ఆయన చెప్పారు. నాలాల ఆక్రమణలను తొలగించడానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.