బెజవాడ మేయర్ సీటుకు 15 మంది పోటీ? ఎన్నిక వాయిదా ?-తేల్చేసిన ఎంపీ ..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 పట్టణ స్థానిక సంస్థల్లో ముందుగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దమవుతోంది. అయితే ఇందులో 23 చోట్ల కోర్టు కేసులతో వివాదాలు నడుస్తుండగా.. మిగిలిన 100 సీట్లలో అయినా ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇందులో కీలకమైన విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు ఇప్పుడు అధికార కూటమిని నడుపుతున్న టీడీపీలో కాక రేపుతున్నాయి.
ఈసారి మేయర్ ఎన్నికల్ని ప్రత్యక్ష విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం టీడీపీలో ఆశావహుల్ని భారీగా పెంచింది. దీంతో నగరంలో ఎమ్మెల్యో బోండా ఉమతో పాటు పలువురు ఔత్సాహికులు తమ పిల్లల్ని మేయర్ గా రంగంలోకి దించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఎవరికీ సర్దిచెప్పలేని పరిస్ధితుల్లో సీఎం చంద్రబాబు విజయవాడ కార్పోరేషన్ ఎన్నికల్ని వాయిదా వేయబోతున్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ మేరకు స్థానిక టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని సీఎం చంద్రబాబును కోరినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్వయంగా కేశినేని చిన్ని (Kesineni Chinni) స్పందించారు.

విజయవాడ మేయర్ స్థానం కోసం నెలకున్న పోటీపై కేశినేని చిన్ని స్పందించారు. మేయర్ సీటు కోసం తమ పార్టీలో 15 మందికి పైగా పోటీ పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడికి మేయర్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. మేయర్ సీటులో ఎవరిని పోటీ చేయించాలి అనేది సీఎం ఫైనల్ చేస్తారని కేశినేని తెలిపారు. అదే సమయంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయాలని తాను సీఎంను కోరానన్నది అవాస్తవమని కేశినేని చిన్ని తేల్చిచెప్పేశారు. దీంతో నగరంలో కార్పోరేషన్ ఎన్నికలు వాయిదా పడతాయన్న ప్రచారానికి చెక్ పడినట్లయింది.














Click it and Unblock the Notifications