సిఎం అస్త్రం: బిల్లు వెనక్కి పంపాలని స్పీకర్కు నోటీస్
బిల్లు విషయంలో తప్పు రాష్ట్రపతిది కాదని, హోంశాఖదని ముఖ్యమంత్రి అన్నారు. బిల్లు రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా లేదని ఆయన అన్నారు. శాసనసభా వ్యవహారాల మంత్రి శైలజానాథ్ ద్వారా స్పీకర్కు ముఖ్యమంత్రి తన లేఖను పంపించారు. శానససభకు ఒరిజినల్ బిల్లు పంపించాలని, అయితే ముసాయిదా బిల్లు పంపించి తప్పు చేసిందని ఆయన అభిప్రాయపడుతున్నారు. వెనక్కి పంపించాలని ముఖ్యమంత్రి ఇచ్చిన నోటిసు మీద సభలో అధికారిక తీర్మానం చేయాల్సి ఉంటుంది.
రూల్ 77 కింద తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపించాలని ఆయన కోరారు. హోంశాఖకు రాజ్యాంగం గురించి తెలియదని ఆయన విమర్శించారు. లోపభూయిష్టంగా ఉన్న బిల్లుపై తాము చర్చకు సిద్ధంగా లేమని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రసంగంపై స్పందిస్తూ అన్నారు. వెనక్కి పంపించే అధికారం శాసనసభకు ఉందనే విషయాన్ని కూడా ఆయన అన్యాపదేశంగా చెప్పారు.
రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లును తిరస్కరిస్తూ ఉభయసభల్లో తీర్మానం ప్రవేశపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు ప్రభుత్వం తరఫున అధికారిక తీర్మానం ప్రవేశపెట్టేందుకు ఉభయ సభల నాయకులు అనుమతి కోరారు. ఇందులో భాగంగానే కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ నాదెండ్ల మనోహర్కు, మంత్రి సి. రామచంద్రయ్య మండలి చైర్మన్ చక్రపాణికి నోటీసులు ఇచ్చారు.
తెలంగాణ ముసాయిదా బిల్లును వెనక్కి పంపించాలని కోరుతూ శాసనమండలి చైర్మన్ చక్రపాణికి మంత్రి సి. రామచంద్రయ్య కూడా నోటీసు ఇచ్చారు. కాగా, కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెసు నాయకులు మండిపడుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డిపై తమ కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి చెప్పారు.