ఆంధ్రా కాశ్మీర్ లంబసింగికి...పోటెత్తిన పర్యాటకులు
చింతపల్లి: దట్టంగా కమ్ముకున్న పొగమంచు...ఓవైపు ఇంకా కురుస్తున్న మంచు తుంపరులు...ఈడ్చికొట్టే అతిచల్లని గాలులు...ఒకవైపు వలస పూల సోయగాలు...మరోవైపు ఆకుపచ్చని హరితారణ్యం అందాలు.... అంతా ప్రకృతి సోయగాల మయం...వెరసి అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణం...ఇవన్నీ చూడాలంటే ఏ స్విట్జర్లాండ్కో...కనీసం కాశ్మీర్ కో వెళ్లాలనుకుంటున్నారో...అవసరం లేనేలేదు...మన ఆంధ్రప్రదేశ్లోనే అలాంటి ప్రదేశం ఒకటుంది...అందుకే దాన్ని ఆంధ్రా కాశ్మీర్ అంటారు. అదే లంబసింగి...
ఆంధ్రాకాశ్మీర్ లంబసింగికి పర్యాటకులు పోటెత్తారు. సెలవులన్నీ కలసి రావడంతో ఈ అతి శీతల ప్రాంతానికి ప్రకృతి ప్రేమికులు తరలివచ్చారు. ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇంకా ఇక్కడకు వెల్లువలా వస్తూనే ఉన్నారు.
ఎక్కడ ఈ లంబసింగి...
విశాఖ జిల్లాలో సముద్ర మట్టానికి 3500 అడుగుల ఎత్తులో ఉంది ఈ లంబసింగి. చింతపల్లి వెళ్లే మార్గంలో నర్సీపట్నం దాటిన తర్వాత 60 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ప్రాంతం. నాలుగేళ్ల క్రితం ఒక్కసారిగా వాతావరణం సున్నా డిగ్రీలకు పడిపోవడంతో అప్పట్నుంచి ఈ ప్రాంతం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. లంబసింగిలో ఇప్పుడు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతలు 4డిగ్రీలకు లోపలే ఉండటంతో ఏజెన్సీ ప్రాంతంలో బాగా దట్టంగా పొగమంచు కమ్ముకుంటోంది.
పర్యాటకుల సందడే సందడి...
దీంతో ఎక్కడెక్కడి ప్రకృతి ప్రేమికులు లంబసింగి దారిపడుతున్నారు. ఇక లంబసింగి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే పర్యాటకులతో జాతరని తలపించింది. శనివారం రాత్రే సొంత, ప్రైవేటు వాహనాల్లో వచ్చి గుడారాలు వేసుకొని రాత్రంతా జాగారం చేశారు. దట్టంగా కురుస్తున్న పొగమంచును ఆస్వాదిస్తూ ఆహ్లాదంగా గడిపారు. సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ కొంతమంది పర్యాటకులు కట్టెలు, కిరోసిన్ వెంట తెచ్చుకుని మరీ చలిమంట వేసుకున్నారు. యువతీయువకులు ఆ నెగళ్ల చుట్టూ తిరుగుతూ ఆటపాటలతో సందడి చేశారు. ఉదయం ఆరు గంటలకు కొద్దిగా వెలుతురు రావడంతో పర్యాటకులు తమ సెల్ఫోన్లలో ప్రకృతి అందాల బ్యాక్ డ్రాప్ తో సెల్ఫీలు , గ్రూప్ ఫొటోలు తీసుకుంటూ హడావుడి చేశారు.
సుదూర ప్రాంతాల నుంచి....
విశాఖ పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు లంబసింగికి తరలిరావడంతో ఈ మార్గంలో రహదారులు కిక్కిరిసిపోయాయి. విశాఖపట్నం ,విజయవాడ, హైదరాబాద్ నుంచే కాకుండా ఏకంగా బెంగళూరు నుంచి కూడా వాహనాల్లో లంబసింగికి పర్యాటకులు వచ్చారంటే ఈ ప్రదేశానికి ఎంత క్రేజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఉదయం తొమ్మిది గంటల వరకూ పర్యాటకులు వస్తూనే ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉందో అంచనా వేసుకోవచ్చు. దీనికితోడు పర్యాటక శాఖ కూడా ఈ ప్రాంతంలో మౌళిక సదుపాయాలు బాగానే కల్పించడం వల్ల పర్యాటకులు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం లేదు.
వాహనాలతో ట్రాఫిక్ జామ్...
ఇలా పోటెత్తిన పర్యాటకులతో లంబసింగి జంక్షన్ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు కార్లతో కిక్కిరిసిపోయింది. జంక్షన్ నుంచి బురడవీధి వరకు నాలుగు కిలోమీటర్ల మేరకు వాహనాలు బారులుతీరాయి. మరోవైపు తాజంగి రిజర్వాయర్ నుంచి తాజంగి గ్రామం బీటాలైన్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.