బీజేపీతో జగన్ లాలూచీ: అచ్చన్న తీవ్ర వ్యాఖ్య, బాబుకు సుజన వివరణ
విజయవాడ: ఏపీ మంత్రి, టిడిపి నేత అచ్చెన్నాయుడు శనివారం నాడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో లాలూచీ కారణంగానే వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీని పల్లెత్తు మాట అనడం లేదని వ్యాఖ్యానించారు.
ప్రత్యేక హోదా అంశంపై ఆయన మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించకుండా కపట నాటకమాడిన కాంగ్రెస్ పార్టీనే ఈ విషయంలో మొదటి ముద్దాయి అన్నారు. కాంగ్రెస్తో పాటు ప్రధాన ప్రతిపక్షం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన తప్పుబట్టారు.
లాలూచీ కారణంగా జగన్ కేంద్రాన్ని ఏమీ అనడం లేదన్నారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని చేసిన ప్రకటనకు అనుగుణంగానే తమ ప్రభుత్వం కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేయనున్నామన్నారు.

వివరణ ఇచ్చుకున్న సుజన
ప్రత్యేక హోదా సాధన కోసం నిరంతరమూ కేంద్రంతో పోరాడుతున్న తాను.. కేవీపీ రామచంద్ర రావు ప్రయివేటు మెంబర్ బిల్లును లోకసభకు పంపాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చిన సమయంలో బల్లలు చరుస్తూ మద్దతు పలికినట్టు వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం చంద్రబాబుకు వివరణ ఇచ్చుకున్నారు.
కురియన్ రూలింగ్ ఇస్తున్న సమయంలో సుజనా బల్లలు చరచడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. సుజన చేసింది కరెక్ట్ కాదని చంద్రబాబు అన్నారు. దీనిపై అధినేతకు సుజన వివరణ ఇచ్చారని తెలుస్తోంది. తనకు బల్లలు కొట్టాల్సిన అవసరం లేదని, తాను ఆ పని చేయలేదన్నారు. ఆరోపణలు అసత్యమని చెప్పారు.












Click it and Unblock the Notifications