అమర రాజా తరలింపు దుమారం : చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఎమ్మెల్యే రోజా షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ తమిళనాడుకు తరలింపు వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. గత నాలుగైదు రోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారిన ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నేత, ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీని ఇబ్బంది పెట్టాలని ఏపీ సర్కార్ భావించిన నేపథ్యంలోనే ఫ్యాక్టరీ తరలింపుకు సంస్థ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని, దీనివల్ల రాష్ట్రంలో ప్రజలు ఉపాధి కోల్పోతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై టీడీపీ కావాలనే రాద్ధాంతం చేస్తుందని వైసీపీ నేతలు ఎదురు దాడికి దిగారు.
అమరరాజా బ్యాటరీస్ వ్యవహారంలో ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యవహారంపై వైసిపి నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ వ్యవహారంపై, టీడీపీ అధినేత చంద్రబాబుపై కూడా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. అమర రాజా వ్యవహారంలో టిడిపి అనవసరపు రాజకీయం చేస్తోందని ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న 54 పరిశ్రమలకు కాలుష్య నియంత్రణ మండలి నోటీసులు ఇస్తే టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం ఒక అమర రాజా గురించే మాట్లాడడం సిగ్గుచేటని రోజా విమర్శించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.
దీనిని కాలుష్య సమస్యగా చూడాలన్న రోజా .. చంద్రబాబుకు హితవు
కాలుష్యాన్ని మాత్రమే సమస్యగా చూడాలని హితవు పలికిన రోజా తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహించే ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నా ప్రశ్నించకూడదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా అన్ని పరిశ్రమలతో పాటే అమరారాజాకు నోటీసులు ఇచ్చారని, వారికే ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వలేదని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు . నిబంధనలు పాటించని పరిశ్రమలకు మాత్రమే కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నోటీసులు ఇచ్చిందని రోజా గుర్తు చేశారు. అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ గాలి, నీరు, భూమిని కలుషితం చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినా చంద్రబాబుకు పరవాలేదా అని ప్రశ్నించారు రోజా.
అమర రాజాను ప్రభుత్వం మూసివెయ్యాలని చెప్పలేదు
చంద్రబాబు ఏపీ ప్రభుత్వంపై పదే పదే విమర్శలు చేస్తున్నారని అసహనం వ్యక్తం చేసిన రోజా ఇది పద్ధతి కాదు అని మండిపడ్డారు. పరిశ్రమలకు ప్రభుత్వం వ్యతిరేకం కాదని, నియమ నిబంధనలతో పరిశ్రమలు నడిపించడమే ప్రభుత్వ కర్తవ్యమని రోజా స్పష్టం చేశారు. అలా కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే చూస్తూ సహించలేమని నగరి ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలను శిరసావహించి కంపెనీ తన తప్పును దిద్దుకోవాలని రోజా పేర్కొన్నారు. అమర రాజా కంపెనీని జగన్ ప్రభుత్వం మూసివేయాలని చెప్పలేదని, నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా పనిచేయాలని మాత్రమే చెప్పిందని ఎమ్మెల్యే రోజా వెల్లడించారు. పర్యావరణానికి హాని కలిగే ఎన్నో పరిశ్రమలకు తెలంగాణలో కూడా నోటీసులు ఇచ్చారని, అది తెలుసుకొని మాట్లాడాలన్నారు రోజా. ప్రతి దాన్నీ రాజకీయం చేయడం చంద్రబాబుకు అలవాటైపోయింది అని ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు.
తప్పులు దిద్దుకుని రూల్స్ ప్రకారం నడిపించుకోవాలని అధికారులు కోరారన్న రోజా
తప్పులను సరిదిద్దుకుని రూల్స్ ప్రకారం పరిశ్రమను నడిపించాలని అమర రాజా యాజమాన్యాన్ని ప్రభుత్వ అధికారులు కోరారని చెప్పిన రోజా కావాలనే టీడీపీ నేతలు ఇదంతా చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇదిలా ఉంటే చిత్తూరు జిల్లాలో వేల మంది ప్రజలకు ఉపాధి కల్పిస్తున్న అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ తమిళనాడు రాష్ట్రానికి తరలించాలని యాజమాన్యం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తమిళనాడు సీఎం కూడా రెడ్ కార్పెట్ పరిచి మరి తమ రాష్ట్రంలో ఫ్యాక్టరీని ప్రారంభించాలని ఆహ్వానించారు.ఈ నేపథ్యంలో 16 వేల మందికి ప్రత్యక్షంగా 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, ప్రభుత్వానికి 11,865 కోట్ల రూపాయల మేర పన్నులు కడుతున్న అమర రాజా బ్యాటరీ ఫ్యాక్టరీని తరలించవద్దని చిత్తూరు జిల్లా వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.
అమర రాజా తరలింపు వద్దని చిత్తూరు వాసుల ఆందోళన
జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న అమర రాజా కంపెనీ ఏపీలో ఉంటే వేలాది మంది ప్రజలకు ఉపాధి కలుగుతుందని వారంటున్నారు. ప్రభుత్వ వైఖరి వల్లే అమర రాజా తరలింపు ఆలోచన చేశారని, ప్రభుత్వం ఎలాగైనా అమర రాజా బ్యాటరీల ఫ్యాక్టరీ తరలింపు జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో నోటీసులు జారీ చేసి ఫ్యాక్టరీని మూసివెయ్యాలని హుకుం జారీ చేసిన సర్కార్ , ఇప్పుడు ఇరకాటంలో పడింది. అమరారాజాను తాము వెళ్ళిపొమ్మని చెప్పలేదని, నిబంధనలతో ఫ్యాక్టరీని నడిపించాలని చెప్పామని ప్రకటనలు చేయిస్తుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే రోజా కూడా క్లారిటీ ఇచ్చారు.
అమర రాజా వ్యవహారంలో జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న టీడీపీ
టిడిపి నేతలు మాత్రం అమర రాజా వ్యవహారంపై నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు సంబంధించిన అమర రాజా బ్యాటరీస్ ను మూసివేయించే కుట్రలో భాగంగానే వైసీపీ సర్కార్ అడుగులు పడ్డాయని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా టీడీపీ నేతలను టార్గెట్ చేస్తూ వారి వ్యాపారాలను వైసీపీ సర్కార్ దెబ్బ కొడుతుందని గత కొంతకాలంగా టీడీపీ నేతలు విమర్శిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలోనే ఏపీలో పరిశ్రమను నిర్వహించలేక తమిళనాడు తరలించాలని అమర రాజా యాజమాన్యం నిర్ణయం తీసుకున్న క్రమంలో ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ ను పదేపదే టార్గెట్ చేస్తున్నారు టిడిపి నేతలు.