రాష్ట్రాన్ని తగులబెట్టి డిన్నర్లా: మంత్రులపై నారాయణ
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నడుమ మంటపెట్టి వినోదిస్తోందని విమర్శించారు. సిడబ్ల్యుసి చేసిన తీర్మానాన్ని ఆ పార్టీకి చెందిన ముఖ్యమంత్రే వ్యతిరేకించడం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేదని నారాయణ విమర్శించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వచ్చే అవకాశం ఉందని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు.
అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు సానుకూలమని చెప్పి వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు ఇప్పుడు మాట మార్చి యూటర్న్ తీసుకున్నాయని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజల అనుమానాలను నివృత్తి చేసే బాధ్యత ఆ ప్రాంత నేతలదేనన్నారు. సోనియా నిర్ణయం శిరోధార్యమని చెప్పిన కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం వైఖరి మార్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులు మాట మార్చడంతోనే సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. సీమాంధ్రలో సమ్మె పేరుతో ఆర్టీసీ బస్సులను, ప్రభుత్వ పాఠశాలలను అడ్డుకుని ప్రైవేటు బస్సులు, పాఠశాలలను వదిలేయడం ఏమిటని ప్రశ్నించారు.
తెలంగాణ సాయుధపోరాట వారోత్సవాల సందర్భంగా వామపక్షాల ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఈ నెల 17న సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ధరల పెరుగుదలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ఈ నెల23న ధర్నాలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో కలెక్టరేట్ల వద్ద సత్యాగ్రహ దీక్ష చేస్తామని ప్రకటించారు.